గజ్వేల్: రైతు వ్యతిరేక చట్టాలతో వేలాది రైతుల చావుకు బీజేపీ (BJP) కారణమైందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. మూడు గంటల కరెంటు చాలంటూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందని చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్షేమానికి కృషిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను (CM KCR) ప్రజలు దీవించాలన్నారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా ములుగు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్, వర్గల్ మండలం గౌరారంలో సర్కిల్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులకు మంత్రి మహమూద్ అలీతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లిలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల నాయకులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ బీజే పీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు వింటున్నారని, మరోవైపు చంద్రబాబు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వింటున్నారని విమర్శించారు. కిషన్ రెడ్డి గురువు కిరణ్ కుమార్ రెడ్డి అని, చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అని.. వీరిద్దరితో తెలంగాణ బతుకులు ఆగమైతాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమంపై ముందు చూపుతో ఎవరు వ్యవహరిస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు.