సకల కళల సుమ మాల కళాకారుల కంచు కోట
వెండితెరకు ముందు కళా సామ్రాజ్యంలో నాటకమే రారాజు
నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం
రసాత్మక కావ్యం నాటకం..
శ్రవణ సహిత దృశ్య రూపకం నాటకం..
సకల లలిత కళల సమాహారం నాటకం..
వెండితెరకు ముందు కళా సామ్రాజ్యంలో రారాజు నాటకం..
ఖిలావరంగల్, మార్చి 26 : సకల కళల సుమ మాల.. కళాకారుల కంచుకోట అయిన ఓరుగల్లు రంగస్థలం, కళామతల్లికి చేసిన సేవ అజరామరం..అనిర్వచనీయం.. నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
నవరసాలను అవలీలగా పోషించి తమ నటనతో ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్రవేసిన కళాకారులు ఎందరో ఓరుగల్లు కీర్తిని నలుదిశలా చాటారు. నాటకంలోని పాత్ర తీరుతెన్నులు, స్వభావాన్ని చూపడమే కాకుండా కంటికి కనిపించని గత కాలపు వ్యక్తుల వ్యవహారిక జీవితాలు స్ఫురణకు వచ్చేలా ఒక రకమైన అర్థాన్ని, రసాత్మకతను కలుగచేసే ఆహార్యం రంగస్థల కళాకారులదే. నాటి సమాజంలో నైతిక విలువలు, మానవ సంబంధాలపై అవగాహన కలిగించే పౌరాణిక నాటకాలు.. కళ కళ కోసం కాదు ప్రజల కోసమే అనే భావనతో సకల కళల సమాహారమైన నాటకం కూడా ప్రజా పోరాటాలకు సాంస్కృతిక భూమికను అందించింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వరకూ నాటకమే నిబద్ధతను ప్రదర్శించింది. అలాంటి రంగం కాలక్రమం లో వెనకుపోయిన మాట వాస్తవమే అయినా స్వరాష్ట్రం లో భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ నాటక సంగీత అకాడమీ నాటకరంగానికి ఊతమిస్తున్నాయి. నాటక స మాజాలకు, సంస్థలకు ఆర్థిక సాయం అందించడమేగాక వర్క్షాపులు కూడా నిర్వహిస్తూ కొత్త నాటకాలకు, కళాకారులను ప్రోత్సహిస్తున్నాయి.
విస్తృత నాటక చైతన్యానికి నిలువుటద్దం ఓరుగల్లు
పద్య పౌరాణిక నాటకాలు, జానపద నాటకాలు, సాంఘిక నాటకాలు ఆధునిక నాటకాల ప్రదర్శనలో ఓరుగల్లు కళాకారులు దిట్ట అంటే అతిశయోక్తికాదు. విస్తృత నాటక చైతన్యానికి ఓరుగల్లు ప్రతీకగా నిలిచింది. కాకతీయుల కాలం నుంచి నేటి ఆధునిక రంగస్థల కళాకారుల వరకు ఎందరో కళామతల్లి ముద్దు బిడ్డలు ఈ నేలపైనే పుట్టారు. ప్రజల వినోదం కోసం అత్యధికంగా ఆదరణకు నోచుకున్న కళలో ఒకటైన నాటకానికి కాకతీయులు పెద్దపీఠ వేశారని చెప్పేందుకు అనేక నిదర్శనలున్నాయి. తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి పొందిన వీధినాటకం క్రీడాభిరామం. ప్రతాపరుద్రుడి భోగపత్ని మాచలదేవి గౌరవార్థం వినుగొండ వల్లభరాయుడు రచించి ఓరుగల్లులో ప్రదర్శించినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. గణపతిదేవుడి బావమరిది సైన్యాధిపతి అయిన జాయపసపేనాని రచించిన నృత్యరత్నావళి, వాయిద్య రత్నావళి, గీతరత్నావళి, విద్యానాథుడిచే విరచితమైన ప్రతాపరుద్రీయం, పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో నాటక ప్రస్తావన, ప్రతాపరుద్రుడు ‘యయాతి చరిత్ర’ అనే సంస్కృతిక అలంకారిక గ్రంథాలను ఏకశిలానగరంలో నాటకాలుగా ప్రదర్శించారు.
నాటకాలకు వరంగల్ ప్రధాన వేదిక
బతికినన్నాళ్లూ నాటకం మధ్యనే బతికిన ఎందరో మహానుభావులకు వరంగల్ ప్రధాన వేదికగా మా రింది. పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలను ప్రదర్శించినవారు కూడా ఈ ప్రాం తంలోనే ఉన్నారు. నాటి కాకతీయుల స్ఫూర్తితో కళామతల్లికి పందిళ్ల శేఖర్బాబు, జే కృష్ణమూర్తి. నాగ మణీంద్రశర్మ, రవీందర్రావు, ఎం. సదానందచారి, మోతుకూరి మధుసూదన రావు. బీ శ్రీధరస్వామి, కూచన చక్రపాణి, కాశీపేట తిరుమలయ్య, పాలయి ఆదిరెడ్డి, డాక్టర్ నాంపల్లి, తుమ్మ మల్లేశం, వనం లక్ష్మీకాంతారావు, ఆ కుల స దానందం, ఎస్కే. గౌడ్, ఎస్ఎన్ ఆచా రి, ర మేశ్, పూల శ్రీనివాస్, జీవి బాబు, కళా రాజేశ్వర్రావు, శతపతి శ్యామలారావు, బూర విద్యాసాగర్గౌడ్, పొగాకు సుదర్శన్, రాజిరెడ్డి, డాక్టర్ వనం మధుసూదన్, ము చ్చర్ల సత్యనారాయణ, మల్లెల రాజేశ్వరశర్మ, ఉ మామహేశ్వరరావు, నాగేశ్వర్రావు, సుదర్శ న్ వంటి నటులు, రచయితలు, దర్శకులు వి శేష సేవలందించారు. వనం లక్ష్మీకాంతరా వు, పందిళ్ల శేఖర్బాబు, జమ్మలమడక కృష్ణమూర్తి వంటి ప్రముఖులు నంది నాటకోత్సవాలతోపాటు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. పంది ళ్ల శేఖర్బాబు వంటి ప్రసిద్ధ పౌరాణిక నటు లు గరుడ, హనుమ వంటి అవార్డులు పొందడం ఇక్కడి రంగస్థల చైతన్యానికి నిదర్శనం.
అలరించిన ప్రదర్శనలు
మట్టెవాడ, మార్చి 26: ప్రపంచ నాటక రంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ పోతన విజ్ఞాన పీఠంలో శుక్రవారం నిర్వహించిన నాటక ప్రదర్శనలు పలువురిని అలరించాయి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కోసం శాంతి కృష్ణ సేవాసమితి వారి అనుబంధంతో పోతన విజ్ఞాన పీఠం సంయుక్త ఆధ్వర్యంలో భానోదయ నాట్య మం డలి (సురభి) వారు ఈ కార్యక్రమాలు నిర్వహిం చారు. 24గంటల పాటు నిర్విరామ నాటక, నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. 24మంది నటులు నాటకా లను, 24మంది నృత్యకారులు 24రకాల నృత్య రీ తులను ప్రదర్శించారు. డాక్టర్ వంగాల శాంతి కృష్ణుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ నమిలికొండ బాలకిషన్, డాక్టర్ వెంపటి శ్రావణి, సీతాల రాఘవేం దర్ రావు, శ్యామల్ రావు, రేకాందర్ నాగబాబు, కళాకారులు పాల్గొన్నారు.