Minister Harish Rao | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ‘కేంద్రం నిధులు వినియోగిస్తే మోదీ ఫొటో పెట్టాల్సిందే’ అని మాట్లాడడంలో ఔచిత్యం లేదన్నారు. యూపీఏ హయాంలో ప్రధానిగా మన్మోహన్ ఉన్న సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఎన్నడైనా రేషన్ దుకాణంలో మన్మోహన్ ఫొటోను పెట్టారా? అని ప్రశ్నించారు. అప్పటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనైనా పెట్టారా? అని నిలదీశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలపై ఒత్తిడి తేవడం ఎంత వరకు సబబు అన్నారు.
కేంద్ర ప్రాయోజిత పథకాలు చాలా వరకు రద్దు చేశారని, కేంద్ర పథకాల్లో వాటాను తగ్గించి.. రాష్ట్రాల వాటాను పెంచారని ఆరోపించారు. కొన్ని పథకాల లక్ష్యాలు, రాష్ట్రాల ప్రయోజనాలకు తగినట్లు లేవని, అనవసరమైన పథకాలు అమలు చేస్తూ, రాష్ట్రాల వాటా పెంచి.. భారం వేయడం తప్ప కేంద్రం రాష్ట్రాలకు చేసిన మేలు ఎంటని ప్రశ్నించారు. పనికి ఆహార పథకాలంటి మంచి పథకాలపై కొర్రీలు వేస్తూ.. వాటికి నిధులు తగ్గిస్తూ, కొత్త నిబంధనలు పెడుతూ నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం కేంద్రం రాష్ట్రాలపై పథకాల పేరుతో పెత్తనం చేయడం తప్ప సమాఖ్య విలువలను పెంచే విధంగా ఉందా? ఆలోచన చేయాలని హరీశ్రావు కేంద్రమంత్రికి చురకలంటించారు.
నీతి ఆయోగ్ నియమించిన ముఖ్యమంత్రుల ఉపసంఘం కేంద్ర ప్రాయోజిత పథకాల సంఖ్యను తగ్గించి, ఐచ్ఛిక పథకాలను (ఆప్షనల్) ప్రవేశపెట్టాలని, తద్వారా రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుందని సిఫారసు చేసినట్లు గుర్తు చేశారు. ఆ సిఫారసులను కేంద్రం పట్టించుకోలేదని, ముఖ్యమంత్రుల ఉప సంఘం అనుభవపూర్వకంగా, శాస్త్రీయంగా అధ్యయనం చేసి.. చేసిన సిఫారసులు కేంద్రానికి ఎందుకు నచ్చలేదో ప్రజలకు వివరిస్తే బాగుండేదన్నారు. అది వదిలేసి ఫొటోల కోసం రాద్ధాంతం చేయడం చూసి.. తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. ప్రజల అవసరాలా.. ప్రచార ఆర్భాటాలా? అని మాట్లాడుకుంటున్నారన్నారు.
ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని పునః సమీక్షించడానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం సిఫారసుపై మీడియా ప్రశ్నిస్తే కేంద్ర ఆర్థికమంత్రిగా సమాధానం చెప్పకుండా.. తప్పించుకునే ప్రయత్నం చేశారన్నారు. కరోనా మహమ్మారి దృష్యా రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి.. రుణాలు తీసుకునే పరిమితులను పెంచామని చెప్పి తప్పించుకున్నారని, కేవలం సిఫారసు మాత్రమే.. దాన్ని మేం ఎందుకు ఆమోదించాలన్న రీతిలో మాట్లాడడం సరికాదన్నారు. మాకు నచ్చించే మేం చేస్తాం.. ఎవరి సిఫారసులను పెట్టించుకోం అన్నది మీ విధానమా? అని నిలదీశారు. రాజ్యాంగం ప్రకారం.. రుణాలను నియంత్రించే హక్కు కేంద్రానికి ఉందని చెప్తున్నారని, కానీ, అదే కేంద్ర ప్రభుత్వం మాత్రం రుణ పరిమితులను దాటి ఎలా అప్పులు చేస్తోందని ప్రశ్నించారు. రాజ్యాంగం కేంద్రానికి ప్రత్యేకమైన అధికారాలు ప్రశ్నించిందా? అన్నారు. కేంద్రం తన ఆదాయ, వ్యయాల మధ్య సమతుల్యత కోసం, ద్రవ్యలోటు లక్ష్యాలను అధిగమించడం కోసం బడ్జెట్ వెలుపల రుణాలు తీసుకుంటుందని, రాష్ట్రాలు మాత్రం బడ్జెట్ వెలుపల రుణాలు తీసుకోవద్దని నియంత్రించడం ఎంత వరకు న్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత్లో రెసిషన్ ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి పదేపదేచెబుతున్నారని, అయితే వాస్తవాలకు విరుద్ధంగా ఉందన్నారు. స్థిర ధరల వద్ద 2016-17లో జీడీపీ 8.26 శాతం నుంచి 2018-19లో 6.53 శాతానికి, ఆ తర్వాత 2019-20లో 3.66 శాతానికి జీడీపీ వృద్ధి క్షీణించడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం కాదా? అని హరీశ్రావు ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రూపాయి బలహీనపడడం, ద్రవ్యోల్బణం తదితర సమస్యలు దేనికి సంకేతాలతో కేంద్రమంత్రిగా చెబితే బాగుండేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, పెట్రోల్, డిజీల్, గ్యాస్ధరలు పెంచి సామాన్యుడి బతుకు భారంగా ఉంటే.. అంతా బాగుందని చెప్పుకోవడం స్వోత్కర్ష తప్ప మరేం లేదన్నారు.
తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారాన్న ప్రశ్నకు కేంద్ర మంత్రిగా.. అన్నీ తెలిసి అవాస్తవాలు మాట్లాడరన్నారు. భజన హమీలు అమలు చేయడం వివక్ష కాదా?.. న్యాయబద్ధంగా కేంద్రం నుంచి రావాల్సిన రూ.7,103కోట్ల బకాయిలు ఇవ్వకపోవడం వివక్ష కాదా? అని నిలదీశారు. ప్రస్తుత సంవత్సరంతో సహా మూడేళ్ల పాటు రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల చేయకపోవడం, నిమ్జ్ రద్దు, వైద్య కళాశాలలు, నవోదయ విద్యా సంస్థలను మంజూరు చేయకపోవడం, ఐటీఐఆర్ రద్దు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకపోవడం, ఐఐఎం వంటి జాతీయ ప్రాముఖ్యత ఉన్న విద్యాసంస్థను ఇవ్వకపోవడం, బల్క్ డ్రగ్ పార్క్ రాష్ట్రానికి తిరస్కరించడం వివక్ష కాదా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ బల్క్ డ్రగ్స్లో ప్రధాన ఉత్పత్తిదారు అని కేంద్ర ఆర్థిక మంత్రికి గుర్తు చేశారు.
సెస్ల రూపంలో వచ్చే నిధులు రాష్ట్రాలకే వెళ్తాయని చెప్పారని, పన్నుల్లో వాటా ఎగ్గొట్టడం తప్ప.. ఇందులో ఉన్న మతలబు ఏంటని ఆరోపించారు. ‘బలమైన కేంద్రం.. బలహీనమైన రాష్ట్రాలు’ అనే కుట్రలో ఇదంతా భాగమే కదా? అని ప్రశ్నించారు. సెస్ల వసూళ్లలో రాష్ట్రాలకు న్యాయబద్ధంగా రావాల్సిన పన్నుల వాటాను తగ్గించి, కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చేసేందుకే ఈ రీతిలో వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తే, రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రం ఖర్చు చేసే వీలుంటుందని కానీ.. సెస్ రూపంలో వసూలు చేసి కేంద్రం తన ఇష్టం వచ్చిన రీతిలో అంటే.. తమకు ఇష్టమైన రాష్ట్రాలకు ఇవ్వడం, తమకు అనుకూలంగా లేని రాష్ట్రాలకు మొండిచేయి చూపడం చేస్తోందని ఆరోపించారు. ఇలా ఆర్థిక అధికారాలు తమ దగ్గర పెట్టుకుని
రాష్ట్రాలపై పెత్తనం చేయాలని చూస్తోందన్నారు. రాష్ట్రాలు కేంద్రం వద్ద మోకరిల్లాలని చూస్తోందని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా? అని ప్రశ్నించారు.
ఉచితాలు వద్దంటూ.. పేదలకు మీరు చేస్తోన్న అన్యాయంపై ఆర్థిక శాఖ మంత్రిగా లెక్కల బూచి చూపారని హరీశ్రావు విమర్శించారు. లక్షల కోట్ల రుణాలు ఎవరి ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్లకు రద్దు చేసిందో దేశ ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆహారం, ఎరువుల సబ్సిడీలు వంటి ఆదాయ వ్యవయాలను తీర్చేందుకు బడ్జెట్ వెలుపల రుణాలు తీసుకోవడానికి ప్రారంభకులు మీరే కదా? అని చురకలంటించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జీఎస్డీపీ వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్గా ఉందని, సొంత పన్ను రాబడిలో అత్యధిక వృద్ధి కలిగిన రాష్ట్రం తెలంగాణ అన్నారు.
ఇలాంటి వృద్ధి రేటుతో ఉన్న తెలంగాణ అప్పులను తీర్చగలిగే స్థోమత ఉన్న రాష్ట్రమన్నారు. 2019-20లో జీఎస్డీపీ నిష్పత్తికి రుణం 23.5 శాతం మాత్రమే ఉందని, అప్పుతో పోల్చితే జీఎస్డీపీ నిష్పత్తి 35.4 శాతం వరకు ఉందన్నారు. కొన్ని రాష్ట్రాల రుణపరిమితి జీఎస్డీపీ నిష్పత్తి 42.5 శాతం ఉందని, ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ట్రాలకు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న రాష్ట్రాలకు ఒకే రుణ పరిమితి విధించడం సరికాదన్నారు. ఇది ప్రగతిశీల రాష్ట్రాలకు తీరని అన్యాయం చేయడమేనన్నారు. అన్ని రాష్ట్రాలను ఒకే గాటాన కట్టడం అనుసరణీయమైన పద్ధతేనా? అని నిలదీశారు. రుణాలు తీసుకోకుండా, పేదలకు రాయితీలు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించడం రాజకీయ ప్రేరేపిత చర్య కాదా? నిర్మల సీతారామన్ గారు అంటూ హరీశ్రావు ధ్వజమెత్తారు.
వ్యవసాయ రుణాలపై సైతం కేంద్ర ఆర్థిక మంత్రి అర్థ సత్యాలు మాట్లాడారని హరీశ్రావు ఆరోపించారు. వంద మందిలో ఐదుగురికి మాత్రమే రుణమాఫీ జరిగిందని చెప్పారని, రాజ్యసభలో 12.03.2021న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి స్పష్టమైన సమాధానం పార్లమెంట్ వేదికగా ఇచ్చారని, తెలంగాణ ప్రభుత్వంలో 2014లో 36లక్షల మందికి రూ.17వేలకోట్లతో రుణమాఫీ ప్రకటించిందని చెప్పారని గుర్తు చేశారు. తాము రెండు విడతల్లో ఇప్పటి వరకు 5.43 లక్షల మందికి రుణమామాఫీ చేశామన్నారు. రైతుల ఆత్మహత్యలపై సైతం కేంద్రమంత్రి బురదజల్లే ప్రయత్నం చేశారని విమర్శించారు. హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ క్రైమ్ రిక్డార్స్ బ్యూరో నివేదిక ప్రకారం.. 2019 -2021 వరకు ఆత్మహత్యలు ఎక్కువ రాష్ట్రాల జాబితా తయారు చేసిందని, ఆ నివేదిక ప్రకారం తెలంగాణలో ఆత్మహత్యలు లేవని తేల్చి చెప్పిందని గుర్తు చేశారు.
రైతుల కోసం గొప్పగా మాట్లాడుతున్నారన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి తొమ్మిది సీజన్లలో 65లక్షల మందికి రూ.57,880కోట్లు రైతుబంధు పేరుతో సాయంగా అందించామన్నారు. రాష్ట్రంలో 25.78లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతులకు ఇన్నివేల కోట్లు ఖర్చు చేశారా? అని ప్రశ్నించారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోతే.. ఇటీవల 50లక్షల 19వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్రం కొనుగోలు చేసిందన్నారు. ఇది కళ్ల ముందు కనబడే వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మీరే కదా తెలంగాణ ధాన్యం కొనలేమని కొర్రీలు పెట్టి చెతులేత్తేసింది అని నిలదీశారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎంత మంది రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందో.. ఆయా రైతుల పేర్లను వెల్లడించాలన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టుకు డీపీఆర్ తయారు చేయలేదని శుద్ధ అబద్ధం చెప్పడం శోచనీయమని హరీశ్రావు అన్నారు. డీపీఆర్ సమర్పించకుండానే కేంద్ర జలసంఘం అన్ని రకాల అనుమతులు ఇవ్వడం ఎలా సాధ్యమైందో కేంద్రమంత్రే చెప్పాలన్నారు. కేంద్ర జలసంఘం అనుమతులు ఇచ్చిన తర్వాతనే మంత్రిత్వశాఖ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ కూడా ప్రాజెక్టుకు రూ.80,190కోట్లకు అనుమతులు జారీ చేసిందని గుర్తు చేశారు.
కేంద్ర ఆర్థికశాఖ నుంచి ఇన్వెస్టిమెంట్ క్లియరెన్స్ కోసం ప్రతిపాదనలు ఆగస్టు 2018న సమర్పించడం జరిగిందని, వారు కోరిన అన్ని వివరణలను రాష్ట్రం ఎప్పటికప్పుడు సమర్పించిందన్నారు. అయినా నాలుగేళ్లుగా ఇన్వెస్టిమెంట్ క్లియరెన్స్ ఇవ్వకుండా కేంద్రం కావాలని జాప్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే దాన్ని పెండింగ్లో పెట్టడం నిజం కాదా? అని నిర్మలా సీతారామన్ను హరీశ్రావు ప్రశ్నించారు. రాష్ట్రానికి వచ్చి మూడు విమర్శలు.. ఆరు అబద్ధాలు ఆడి రాజకీయం చేస్తానంటే.. తెలంగాణ సమాజం ఊరుకోదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఈ పాచిక పారదని బీజేపీ గుర్తించాలన్నారు.