సిద్దిపేట, ఆగస్టు 10 : కేంద్రంలోని మోదీ సర్కార్.. వజ్రోత్సవాల వేళ జాతీయ జెండాలను పంపిణీ చేయలేని దౌర్భాగపు పరిస్థితిలో ఉన్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. దీనికితోడు కేంద్రమంత్రి కిషన్రెడ్డి ‘జాతీయ జెండాలకు బదులు కాగితాలు అతికించుకోవాలి’ అని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇదేనా జాతీయ జెండాకు మీరిచ్చే విలువ? వజ్రోత్సవాలు నిర్వహించుకొనే తీరు ఇలాగే ఉంటదా? అని కేంద్రం తీరుపై ఆయన మండిపడ్డారు. బుధవారం వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సిద్దిపేట పట్టణంలోని రంగనాయకసాగర్ వద్ద ఫ్రీడమ్ పార్కును మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో గాంధీని విమర్శిస్తూ, గాడ్సేను పొగుడుతూ దుష్ప్రచారం చేస్తున్న బీజేపీ అనుబంధ సంస్థలపై చర్యలు తీసుకొని దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచమంతా గాంధీ బాటలో నడుస్తున్నదన్నారు. మేక్ ఇన్ తెలంగాణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం కోటీ 20 లక్షల జెండాలను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నదని మంత్రి తెలిపారు.