హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో అన్నీ అసత్యాలే మాట్లాడుతున్నారని, ఆయన గోబెల్స్ను మించిపోయారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ స్పష్టంగా లెక్కలు చెప్పి.. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని చెప్పారని అన్నారు. కేటీఆర్ సవాల్పై బీజేపీ నేతలు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా.. డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నారని, వ్యక్తిగతమైన దాడులకు దిగుతున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికమంత్రిగా తాను సాధికారికంగా నిధులకు సంబంధించి లెక్కలు విడుదల చేస్తున్నానన్నారు. మనకు హక్కుగా రావాల్సిన రూ.7183కోట్ల బకాయిలు కూడా తొక్కి పెట్టారనీ, ఎన్నిసార్లు కేంద్ర ఆర్థికమంత్రికి మొరపెట్టుకున్నా ఫలితం శూన్యమన్నారు.
వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇవ్వాల్సిన రూ.1350కోట్లు పెండింగ్లోనే ఉన్నాయని గుర్తు చేశారు. తప్పుగా ఏపీకి కేంద్రం రూ.454 కోట్లు 2014లో విడుదల చేసిన మొత్తం తెలంగాణకు ఇంకా రావడం లేదని, దమ్ముంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బకాయిలు ఇప్పించాలని సవాల్ విసిరారు. హక్కుగా రావాల్సిన బకాయిలకే గతి లేదని, వేరే నిధుల గురించి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాకి కబుర్లు చాలించి.. తెలంగాణకు రూ.3లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిందని బీజేపీ జూటా ప్రచారం చేసుకోంటుందని మండిపడ్డారు.
పల్లెలకు కేంద్రం నేరుగా నిధులు ఇస్తే.. తెలంగాణ పల్లెలాగా వేరే రాష్ట్రాల పల్లెలు ఎందుకు లేవని ప్రశ్నించారు. బండి సంజయ్ రాయ్చూర్ వెళ్లి చూసొద్దామా? అక్కడ పరిస్థితి అంటూ సవాల్ విసిరారు. అక్కడ పల్లెల పరిస్థితి, బీజేపీ నేతలవి జూటా బోగస్ మాటలే .. సంజయ్కి పాదయాత్రలో రాయ్చూర్ రైతులు తెలంగాణ పథకాలు తమకు కర్ణాటక బీజేపీ సీఎంతో ఇప్పించాలని వినతి ఇచ్చారన్నారు. అన్నీ నిధులు పంచాయతీలకు కేంద్రమే.. ఇస్తుంటే తెలంగాణలాగా గ్రామాల్లో ట్రాక్టర్లు డంప్
యార్డులు వైకుంఠ ధామాలు వేరే రాష్ట్రాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు బండి సంజయ్కు కనిపించడం లేదని బొంకుతున్నాడని ధ్వజమెత్తారు.
పల్లె ప్రగతితో గ్రామాల్లో మలేరియా కేసులు తగ్గాయని కేంద్రమే అవార్డు ఇచ్చిందని మంత్రి హరీశ్రావు గుర్తు చేశారు. ఇది సంజయ్కి కనిపించడం లేదా? అన్నారు. కేంద్రం సెస్ల రూపంలో రాష్ట్రాల ఆదాయాలకు గండి కొడుతోందని, పన్నుల్లో 41శాతం వాటా రావాల్సి ఉన్నా సెస్ల పుణ్యమాని 25 శాతానికి మించడం లేదన్నారు. రాష్ట్రాలను బలహీన పరిచే కుట్రకు కేంద్రం తెరలేపిందని, 11 శాతం ఆదాయాన్ని సెస్ల రూపంలో కేంద్రం వసూలు చేస్తోందని ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలని చెప్పినా కేంద్రం పెడ చెవిన పెట్టిందని, బీజేపీ అంటే బడా జూటా పార్టీ, బుల్డోజర్ పార్టీ, భాషణ్ జాదా పార్టీ బుట్టచోర్ పార్టీగా మారిందని ఆరోపించారు.
మాటలు ఎక్కువ పని తక్కువ చేసే పార్టీ అనీ, ఎందరో ఆర్థిక వేత్తలు మోదీ దగ్గర పని చేయలేక మధ్యలోనే మానేశారని, అరవింద్ సుబ్రహ్మణ్యం, అరవింద్ పనగరియా, ఊర్జిత్ పటేల్ పదవీ కాలానికి ముందే రాజీనామా చేశారన్నారు. ఆసరా పెన్షన్లు తెలంగాణ తరహాలో మరే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారా? రూ.3వేల పెన్షన్ తెలంగాణలో తప్ప ఎక్కడైనా ఇస్తున్నారా? ఆసరా పెన్షన్లలో తెలంగాణకు కేంద్రం ఇప్పటి వరకు ఇచ్చింది 3శాతం లోపేనని.. బీజేపీ నేతలు ఆసరాపై బోగస్ మాటలు మానాలని హితవు పలికారు.
సంజయ్కి ఏ సబ్జెక్టుపై అవగాహన లేనట్టు కనిపిస్తోందని, రాజోళి బండ ప్రాజెక్టుపై బండి సంజయ్ మాట్లాడుతున్న తీరును చూసి నడిగడ్డ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. డీకే అరుణ ఆర్డీఎస్కు అన్యాయం చేస్తే సీఎం కేసీఆర్ న్యాయం చేశారన్నారు. డీకే అరుణను ఆర్డీఎస్ అరుణగా పిలవాలని సంజయ్ పిలుపునివ్వడం జోక్ ఆఫ్ ది మిలీనియంగా మంత్రి పేర్కొన్నారు. సంజయ్కి, కిషన్రెడ్డికి దమ్ముంటే తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు తేవాలని, కెన్ బట్వా, అప్పర్ భద్రలకు జాతీయ హోదా ఇచ్చినప్పుడు.. పాలమూరు – రంగారెడ్డికి ఎందుకివ్వరని ప్రశ్నించారు.
బీజేపీ నేతలకు తిట్ల పురాణం తప్ప మా నిజాలు జీర్ణం కావని, సుందిళ్ళను పదినెలల్లోనే పూర్తి చేసి.. 55వేల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత మాదన్నారు. డీకే అరుణ మంత్రిగా పాలమూరు సాగునీళ్ల కోసం ఏం చేయలేక పోయారని, గద్వాల ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాలు లేవని బీజేపీ సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. గద్వాలకు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. ఐసీయూ డయాలసిస్ సెంటర్ గద్వాలకు కేటాయించినట్లు చెప్పారు. ఈ వాస్తవాలు డీకే అరుణకు తెలియవా? మంత్రిగా ఉండి ఏం చేశారని ప్రశ్నించారు.
పెట్రోల్ ఉత్పత్తులపై నాలుగు రకాల సుంకాలు కేంద్రం విధిస్తోందని, యూపీఏ హయాంలో కన్నా పెట్రో ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెరిగాయని హరీశ్రావు ఆరోపించారు. గత సంవత్సరం కేంద్రం పెట్రోల్, డీజిల్పై రూ.4లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుందన్నారు. తెలంగాణ ది సంక్షేమ ప్రభుత్వమని, కేంద్రానిది సతాయించే ప్రభుత్వమని మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్ రేటును రూ.400 నుంచి రూ.1000కి పెంచలేదని చెప్పగలరా?.. తాను ముక్కు నేలకు రాస్తానన్నారు.
సబ్సిడీని రూ.40కి తగ్గించారని, సిలిండర్ రేటు పెరగడంతో మళ్లీ కట్టెల పొయ్యి వైపు జనం చూస్తున్నారని, మేం అడవులను పెంచుతుంటే కేంద్రం విధానాలు అడవులను నరకమంటున్నాయని ఆరోపించారు. 15లక్షల ఉద్యోగ ఖాళీలు కేంద్రంలో ఉన్నాయని, వాటిని ఎందుకు భర్తీ చేయరని ప్రశ్నించారు. బండి సంజయ్ వీటన్నింటికి సమాధానం చెప్పి పాదయాత్ర కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతల మాటలు ఉద్యమం సందర్భంలో సమైక్యాంధ్ర నేతలు మాట్లాతున్నారని, ఇకనైనా బీజేపీ నేతలు నిజాయతీగా మాట్లాడాలని హరీశ్రావు హితవు పలికారు.