హైదరాబాద్ : బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని.. అది బడా జూటా పార్టీ మంత్రి హరీశ్ రావు దుయ్యబట్టారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని.. మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. భారత పార్లమెంటరీ వ్యవస్థను అవమానించారు. రాజ్యాంగాన్ని అవమానపర్చారు. వారి మాటలు తెలంగాణ రాష్ట్ర గిరిజనుల మనోభావాలను దెబ్బతీశాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానపర్చేలా ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తొలి నాళ్లలోనే గిరిజనుల రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపాం అని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. పార్లమెంట్లో ప్రశ్న అడిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోయి లేదన్నారు. శాసన సభలో గిరిజన బిల్లును ఆమోదించినప్పుడు ఆయన పీసీసీ అధ్యక్షుడు, శాసన సభలో సభ్యుడని.. ఈ బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం తెలిపిందని.. ఈ బిల్లులో ఉత్తమ్ కుమార్ రెడ్డి భాగస్వామి అన్నారు.
నువ్వే కదా అసెంబ్లీలో ఉన్నది. జీవన్ రెడ్డి గారు ఏకగ్రీవంగా మద్ధతు తెలిపారు. బిల్లులో భాగస్వామ్యం అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్లో అడగడం సిగ్గుమాలిన చర్య, దిక్కుమాలిన ప్రశ్న. ఎప్పటిలోగా గిరిజన బిల్లును ఆమోదిస్తారని అడగాల్సింది పోయి, సోయి తప్పి గిరిజన బిల్లు పెంపు ప్రతిపాదన మీకు వచ్చిందా అని అనుమానాస్పదంగా అడిగారు. ఇలా అడగటం పెద్ద జోక్. కేంద్రం- రాష్ట్రం మధ్య ప్రత్యుత్తరాలు జరిగాయి, పలుమార్లు పార్లమెంట్లో మా ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇదే విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆర్.. ప్రధానమంత్రికి రాతపూర్వకంగా అందించారన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ రెండు సార్లు లేఖ రాశారు. అలాంటిది ప్రతిపాదన రాలేదని చెప్పడం ఇంకా పెద్ద జోక్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ బిల్లులో భాగస్వామి, ఆనాడు కిషన్ రెడ్డి శాసనసభలో బిల్లును శాసన సభా పక్ష నేతగా ఆమోదించారు. ఆయన మద్దతు ఇచ్చారు. ఇవాళ ఆయన కేంద్రంలో భాగస్వామి. అలాంటిది కేంద్రం ప్రతిపాదన రాలేదనడం ఫూల్స్ డ్రామాలా ఉంది. ప్రశ్న అడగడం, సమాధానం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు ఆమోదించిన తర్వాత, మే 29, 2017న శాసన సభ నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపడం జరిగింది. స్పష్టంగా రాష్ట్రం నుండి గిరిజన రిజర్వేషన్ పెంపు బిల్లు కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్రం నుంచి ఎకనాలెడ్జెమెంట్ కూడా పంపారు. హోం మంత్రిత్వ శాఖ దాని మీద గిరిజన శాఖను అడిగితే ఆనాడు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ దిలీప్ కుమార్ కూడా తెలంగాణ రాష్ట్రంలో 9.08 శాతం కంటే తగ్గకుండా గిరిజనులకు రిజర్వేషన్ పెంచాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాశారని మంత్రి గుర్తు చేశారు.