మెదక్ : కులం, మతమేదైనా పేదలందరూ తమ ఆత్మబంధువులేనని మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ పట్టణంలో 500 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు, ఎంపీ ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్రెడ్డి, కలెక్టర్ హరీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మట్లాడుతూ గతంలో కాంగ్రెస్ వాళ్లు కొన్ని ఇల్లు ఇస్తే చుట్టూ తిరగడం, లంచాలు ఇవ్వడంతో పాటు చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేదన్నారు. రూపాయి ఖర్చు లేకుండా.. చెమట చుక్క రాకుండా ఇంట్లోకి పంపించామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నారా? అని మంత్రి ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇల్లు రాలేదని, పేదలు బల పడలేదు గానీ వారే బలపడ్డారన్నారు. సీఎం కేసీఆర్ గతంలో 200 ఉన్న పింఛన్ను 2016కు పెంచారని గుర్తు చేశారు. మెదక్ జిల్లాలో లక్షా6వేల మందికి నెలానెలా పెన్షన్లు అందుతున్నాయని, కొత్తగా 21వేల కొత్త పింఛన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. మెదక్లో కొత్త ఎంసీహెచ్ ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆడపిల్ల పెళ్లికి రూ.లక్ష చెక్కు కల్యాణలక్ష్మి రూపంలో ఇస్తున్నామని, కాంగ్రెస్ హయాంలో పెళ్లికి ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. బీజేపీ వస్తే ఉచితాలు రద్దు చేస్తారని, మనం బీజేపీనే రద్దు చేయాలన్నారు. రూ.10లక్షల కోట్లు పెద్ద పెద్ద కంపెనీలకు బీజేపీ మాఫీ చేసిందని, పేదలకు పెట్టేవారు కావాలా? పెద్దలకు పెట్టేవారు కావాలా? అని ప్రశ్నించారు.
హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, హిందూ ముస్లిం అంటే కడుపు నింపుతుందా అన్నారు. అందరం మనుషులమేనని, మతమేదైనా మనమందరం ఆత్మబంధువులు కావాలన్నారు. కులాలు మతాలు తేడా లేకుండా సాయం చేసే చేతులు, ప్రభుత్వం కావాలన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు మతం చూసి ఇస్తున్నామా?.. అన్ని కులాల వారున్నారన్నారు. అన్ని కులాలు, మతాల్లో పేదలున్నారని మంత్రి పేర్కొన్నారు. పేదలకు సాయం చేయడమే ప్రభుత్వం బాధ్యతని, సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు.
బీజేపీ జోరుగా మాట్లాడుతుందని.. కేంద్రం 157 మెడికల్ కాలేజీలు ఇస్తే.. తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదన్నారు. తెలంగాణకు నవోదయ విద్యాసంస్థలు ఒక్కటీ ఇవ్వలేదని, కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా మోసం చేసిన ప్రభుత్వం బీజేపీ అన్నారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలిస్తామని బీజేపీ చెప్పిందని.. ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదన్నారు. అదే తెలంగాణ ప్రభుత్వం లక్షా32వేల పోస్టులను భర్తీ చేసిందన్నారు. సిలిండర్ ధరను బీజేపీ ప్రభుత్వం రూ.400 నుంచి రూ.1200 వరకు పెంచిందని గుర్తు చేశారు. మోదీకి మహిళలకు సబ్సిడీ సిలిండర్ ఇవ్వడం చేతకాదని, పెద్దలకు పదిలక్ష కోట్లు మాఫీ చేస్తారన్నారు. ఇప్పుడు బాయికాడ మీటర్లు పెట్టేందుకు సిద్ధమైందని మంత్రి ఆరోపించారు.