సంగారెడ్డి, జూన్ 20 (నమస్తే తెలంగాణ): సిపాయిలను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకొనే ‘అగ్నిపథ్’ సరైనది కాదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఆ పథకం ద్వారా మిలిటరీలో చేరేవారికి ఉద్యోగ భద్రత, పింఛను ఉండవని అన్నారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం తాలెల్మలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్తో కలిసి రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమైన యువతను కేంద్రంలోని బీజేపీ కించపరుస్తున్నది.
ఎనిమిదేండ్ల పాలనలో బీజేపీ రూపాయి విలువ దిగజార్చింది. దేశానికి గర్వకారణమైన సిపాయిల గౌరవాన్ని తగ్గించింది’ అని ఆరోపించారు. సైన్యం, సిపాయిలు అంటే ప్రజలకు ఎంతో గౌరవం ఉన్నదని, అలాంటి వ్యవస్థను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. అగ్నిపథ్ పేరిట యువత ఉసురు తీసుకొంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీవి సోషల్ మీడియాలో ప్రచారాలు, అపచారాలు తప్ప ఏమీ ఉండవని ఎద్దేవాచేశారు. నాలుగేండ్లు సైన్యంలో పనిచేసే అగ్నివీరులకు కటింగ్, ఇస్త్రీ చేయటం నేర్పుతామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడటం సరికాదని అన్నారు.
మోదీ నల్ల చట్టాలతో రైతులు, నోట్ల రద్దుతో ప్రజలు, జీఎస్టీతో వ్యాపారులు, అగ్నిపథ్తో యువత, సిలిండర్ ధరలతో అక్కాచెల్లెళ్ల ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు. రైతులు ఉద్యమిస్తే వారు ఖలిస్థాన్ ఉగ్రవాదులని ముద్ర వేసే ప్రయత్నం బీజేపీ చేసిందని చెప్పారు. గాంధీని చంపిన గాడ్సేను బీజేపీ నాయకులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రశంసిస్తున్నా వారిపై చర్యలు తీసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వటం లేదని, బోర్లు, బావుల వద్ద కరెంటు మీటర్లు పెడితే మాత్రం ఏడాదికి రూ.5 వేల కోట్ల నిధులు ఇస్తామని చెప్తున్నదని తెలిపారు. రైతుల కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్ మీటర్లు పెట్టేందుకు ఒప్పుకోవటం లేదని మంత్రి హరీశ్ గర్తు చేశారు.
పక్కనున్న ఏపీలో మీటర్లు పెడుతూ ఏడాదికి రూ.7 వేల కోట్ల నిధులు పొందుతున్నారని చెప్పా రు. కర్ణాటక, మధ్యప్రదేశ్లోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తున్న కేంద్రం.. కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం ఇవ్వటం లేదని విమర్శించారు. కేంద్రం నిధులు ఇచ్చి నా, ఇవ్వకున్నా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారన్నారు. ప్రజలకు మేలు చేసే టీఆర్ఎస్ కావాలా? అపకారం చేసే బీజేపీ కావాలా? అన్నది ప్రజలు తేల్చుకోవాలని అన్నారు.
అందోల్లో 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు
గోదావరి జలాలను సంగారెడ్డికి తీసుకురావాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయంతో అత్యధికంగా అందోల్ నియోజకవర్గం లబ్ధి పొందుతుందని మంత్రి హరీశ్రావు చెప్పారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల, కాళేశ్వరం ఎత్తిపోతల పనులతో ఉమ్మడి మెదక్ జిల్లా లో అత్యధికంగా అందోల్ నియోజకవర్గంలో 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. రూ.37 కోట్లతో చేపట్టిన రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకంతో 14 గ్రామాలకు సాగునీరు అందుతున్నదని వెల్లడించారు.
సమైక్య పాలనలో సింగూరు ప్రాజెక్టు ద్వారా మంజీరా జలాలు జిల్లాకు దక్కేవి కావని, ఇప్పుడు పూర్తిగా సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ వాసులకు దక్కుతున్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా త్వరలోనే గోదావరి జలాలు సింగూరులోకి రానున్నాయని వివరించారు. ఇక ఎప్పటికీ సింగూరు ప్రాజెక్టు ఎండదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో రహదారుల మరమ్మతులకు ఇటీవలే సీఎం కేసీఆర్ రూ.50 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తన సొంత ఊరిలో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ 14 గ్రామాలకు సాగునీరందించే రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించుకోవటం ఆనందంగా ఉన్నదని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను సైతం ప్రారంభించి ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తామని సవాల్ విసిరారు. అనంతరం మంత్రి హరీశ్రావు జోగిపేటలో కొత్తగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. కేజీబీవీ, బాలికల ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.