హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం ‘బారాణా పెంచి.. చారాణా తగ్గించినట్టు’ ఉందని.. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన గాంధీ దవాఖానలో మీడియాతో మాట్లాడాడారు. ‘బారాణా పెంచి.. చారానా తగ్గించి పాలాభిషేకాలు చేయించుకుంటున్నరు. నిజంగా నిజాయితీ ఉంటే మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన్నాడు పెట్రోల్, డీజిల్ మీద ఉన్న పన్నులనే అమలు చేయండి’ అని డిమాండ్ చేశారు. 2014 మార్చిలో డీజిల్ మీద సెస్సు రూ.3.46 ఉండేదని, బీజేపీ దానిని రూ.31 కి పెంచిందన్నారు.
బీజేపీ తాజా తగ్గింపుతో తిరిగి రూ.3కు రాలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం డీజిల్పై రూ.7.40, పెట్రోల్పై రూ.16.40 సెస్ ఉన్నదని గుర్తు చేశారు. తెలంగాణలో ఒక్కసారి కూడా పెంచలేదని స్పష్టం చేశారు. ‘మేం పెంచితే కదా.. తగ్గించడానికి. మీరు 2014లో ఎంత సెస్ ఉందో అక్కడికి తగ్గించి మాట్లాడండి’ అని డిమాండ్ చేశారు. గ్యాస్ సిలిండర్లకు సంబంధించి చాంతాడంత పెంచి.. మూరెడు దించారని కేంద్రాన్ని విమర్శించారు. 2014లో సిలిండర్ ధర దాదాపు రూ.400 ఉండేదని, ఇప్పుడు దాన్ని రూ.వెయ్యికి పెంచారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూ.600 పెంచి రూ.200 తగ్గించిందని గుర్తు చేశారు.
ఈ తగ్గింపు కూడా ఉజ్వల్ పథకం లబ్ధిదారులకేనని.. అంటే 10 మందికి పెంచి, చారాణా మందికి తగ్గించారని ఎద్దేవా చేశారు. ఈ మాత్రం దానికే ‘మేం తగ్గించినం అని చపట్లు కొట్టుకునుడు.. జబ్బలు చరుచుకునుడు ఏంది?’ అని నిలదీశారు. దమ్ముంటే అప్పుడున్న ధర రూ.400కు తగ్గించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. గతంలో గ్యాస్ సిలిండర్పై సబ్సిడీ రూ.400 ఉండేదని, దాన్ని కొంత కొంత తగ్గిస్తూ ఇప్పుడు పూర్తిగా ఎత్తేశారని ఎద్దేవా చేశారు. గ్యాస్ ధర తగ్గింపుపై బీజేపీ చేసే ప్రచారం అంతా హంబక్.. బోగస్ అని కొట్టిపారేశారు.