హైదరాబాద్ : రాష్ట్ర పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రులపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. తెలంగాణలో పర్యటిస్తున్నారు తప్ప.. నిధుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి నిధులు ఇవ్వకపోయినా పర్వాలేదు.. కనీసం తమ వద్ద ఉన్న మంచి పనులు నేర్చుకొని వెళ్లండని కేంద్ర మంత్రులకు హరీశ్రావు సూచించారు. మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరి చూపించడం సరికాదన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ అధ్వాన్నంగా ఉంది. వచ్చి బాగు చేయండి. విద్వేషాలు కాదు, పరిపాలన మీద దృష్టి సారించండి అని హరీశ్రావు సూచించారు.
గాంధీ ఆస్పత్రిలో పిడీయాట్రిక్ ఐసీయూ, సర్జరీ ఐసీయూ,ఎంఐసీయూ, సెమినార్ హాల్స్ను మంత్రి హరీశ్రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎయిమ్స్ విషయంలో ఒక నీతి, రాష్ట్రాల ఆధ్వర్యంలో ఉన్న మెడికల్ కాలేజీల విషయంలో ఒక నీతి అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఒకే దేశంలో ఉన్న మెడికల్ కాలేజీల విషయంలో ద్వంద్వ పద్ధతి సారి కాదన్నారు. ఎన్ఎంసీ నిబంధనలు ఎయిమ్స్కు ఎందుకు వర్తించదు? వైద్య విద్య విషయంలో కేంద్రానికి, రాష్ట్రానికి వేర్వేరు పాలసీలు ఎందుకు? అని ప్రశ్నించారు. ఆపరేషన్ థియేటర్లు, ప్రొఫెసర్లు లేకుండానే ఎయిమ్స్ ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే కేంద్ర మంత్రులను బీబీ నగర్ నిమ్స్ను విజిట్ చేయాలని కోరుతున్నానని హరీశ్రావు తెలిపారు.