హైదరాబాద్ : బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నీచ రాజకీయాల వల్ల మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. టీడీపీతో బీజేపీ కుమ్మక్కై తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి లాభం చేసే కుట్రలో భాగంగానే టీడీపీ మునుగోడులో పోటీ చేస్తుందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ద్రోహులకు బుద్ధి చెప్పాలని మునుగోడు ప్రజలను కోరారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు. బీజేపీ వస్తే రైతుల బావుల వద్ద మీటర్లు పెడతారని, ఉచిత విద్యుత్ తీసేస్తారని హెచ్చరించారు.
ఈ సందర్భంగా మునుగోడులోని మర్రిగూడెం మండలానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి మంత్రి హరీశ్రావు గులాబీ కండువాలు కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గులాబీ పార్టీలో చేరిన వారిలో బీజేవైఎం మండల అధ్యక్షుడు సిలివేరు రఘు, బీజేపీ మండల ఉపాధ్యక్షులు పోలె సైదులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొనుగోటి భాస్కర్ రావు, మండల కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ సహా 30 మంది కార్యకర్తలు ఉన్నారు. టీఆర్ఎస్ గెలుపు కోసం పని చేస్తామని వెల్లడించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గానికి చేసింది శూన్యమని, తమ ప్రాంత అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నామని తెలిపారు.