సిద్దిపేట : పల్లె, పట్టణ ప్రగతి అద్భుతమైన పథకాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఆ రెండు పథకాల వల్ల గ్రామాలు, పట్టణాలు అద్భుతంగా తయారవుతున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్రమే అధికారికంగా ప్రకటించిందని గుర్తు చేశారు. సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద దేశంలో ఉత్తమ గ్రామాలు 20 ప్రకటిస్తే.. అందులో తెలంగాణ నుంచి 19 గ్రామాలు ఉన్నాయన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మంత్రి హరీశ్రావు చెప్పారు. బండి సంజయ్, తొండి సంజయ్, రేవంత్ రెడ్డి అంతా గోబెల్స్.. బండి సంజయ్ మీ పార్టీ 18-19 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కదా.. అక్కడ అవార్డులు ఎందుకు రావడం లేదు? రేవంత్ రెడ్డి కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు.. వాళ్ల పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఎందుకు అవార్డులు రావడం లేదు? అని ప్రశ్నించారు.
సిద్దిపేటలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి మంత్రి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, డంపుయార్డు, వైకుంఠధామం, నర్సీలు ఉన్న గ్రామాలు ఒక్క తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేవని స్పష్టం చేశారు. ఒకప్పుడు తాగునీటికి కష్టాలుండేవి.. ఇప్పుడు ఆ సమస్య లేదన్నారు. సాగునీటి కష్టాలు కూడా తీరాయన్నారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నామని చెప్పారు. పల్లెలు, పట్టణాలు సమంగా అభివృద్ధి చెందుతుంటే ప్రతిపక్షాలకు కండ్లు మండుతున్నాయని హరీశ్రావు మండిపడ్డారు. ఏప్రిల్- మే నెలల్లో ఈరోజు వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద రూ.700 కోట్ల చెల్లింపులు జరిగాయి. వారం రోజుల పనులవే పెండింగ్లో ఉన్నాయని స్పష్టం చేశారు.
వాస్తవానికి కేంద్రం నుంచి ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన రూ.1200 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని బండి సంజయ్ కేంద్రానికి లేఖ రాయాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి రూ. 8,995 కోట్లు రాష్ట్రానికి రావాల్సిన బకాయి ఉంది. ఇందులో ఎక్కువ గ్రామ పంచాయతీలకు, మండలాకు వెళ్లే పైసలే ఉన్నాయి.. కేంద్రం నుంచి విడుదల చేయించాలని మంత్రి డిమాండ్ చేశారు.