నిజామాబాద్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీది ఐరన్ లెగ్గు అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు విమర్శించారు. రాహుల్ ఎక్కడ కాలు పెట్టిన అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని తెలిపారు. అలాంటి రాహుల్ తెలంగాణను ఉద్దరిస్తాడా? అని ప్రశ్నించారు. 94 శాతం ఓటమిలో ఉన్న పార్టీ కాంగ్రెస్ అని హరీశ్రావు పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలంలోని జకోర ఎత్తిపోతల పథకానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో రైతులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరిగిన దిగుబడితో కాంగ్రెస్, బీజేపీలకు కళ్ల మంటగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోవడం, ఎరువులు, విత్తనాల కోసం క్యూ కట్టడం లాంటి ఘటనలు చూశామన్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడం, కోల్డ్ స్టోరేజ్ లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదని హరీశ్రావు స్పష్టం చేశారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరిందన్నారు. అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బీజేపీ రైతుల ఖర్చులను మాత్రం రెట్టింపు చేయగలిగిందని ధ్వజమెత్తారు. బీజేపీ రైతులకు ఏం చేసిందో చెప్పాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేంద్రానికి, ఢిల్లీ పెద్దలకు గులాంగిరి చేస్తాయి, టీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పని చేస్తుందని హరీశ్రావు తేల్చిచెప్పారు.