హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై నోరు పారేసుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. నడ్డా.. ఇది పోరాటాల గడ్డ అని హరీశ్రావు హెచ్చరించారు. తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. తిట్ల పురాణంతోనో, బట్ట కాల్చి మీదేయడం ద్వారానో, బురద జల్లడం ద్వారానో, కేసులు పెట్టడంతోనో, దాడులు చేయడం ద్వారానో తెలంగాణ ప్రజల మనసు గెలవలేరు. మీరు గెలవాలంటే.. గుజరాత్కు ఇచ్చినట్లు ప్యాకేజీలు ఇవ్వండి. ఎన్నికల ముందు గుజరాత్కు లక్షల కోట్ల ప్యాకేజీలు ఇచ్చినటువంటి ప్యాకేజీ ఇవ్వండి. అసలు హక్కుగా రావాల్సిన పైసలు ఇవ్వండి.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకురూ. 24 వేల కోట్లు ఇవ్వమని నీతి ఆయోగ్ చెప్పింది. అవి ఇచ్చి తెలంగాణ ప్రజల మనసు గెలవండి. 15వ ఆర్థిక సంఘం తెలంగాణకు రూ. 5, 374 కోట్ల ఇవ్వాలని సిఫారసు చేసింది. అవి ఎప్పుడు ఇస్తారో చెప్పండి నడ్డా. ఈ దేశ చరిత్రలో ఆర్థిక సంఘం చెప్పింది చెప్పినట్లు అమలైంది. మరి ఒక్క తెలంగాణలో ఎందుకు అమలు కావడం లేదో చెప్పాలి. ఆర్థిక సంఘం నివేదికను గత ప్రభుత్వాలు తూచా తప్పకుండా అమలు చేశాయి. మరి తెలంగాణలో ఎందుకు అమలు కావడం లేదు. బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. తెలంగాణ పట్ల కుట్రపూరిత, పక్షపాత వైఖరి కాదా? తెలంగాణ ప్రజలను ఆర్థికంగా ఇబ్బంది పెట్టే కుట్ర కాదా? డబ్బులు ఇవ్వకుండా, పనులు జరగుతలేవు అని చెప్పడం కుట్ర కాదా? అని హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
రూ. 15 వేల కోట్ల ఎఫ్ఆర్బీఎంలు ఆపి, బోరుబావుల కాడ మీటర్లు పెట్టలేదని రూ. 12 వేల కోట్లు, ఆర్థిక సంఘం చెప్పిన రూ. 5,374 కోట్లు ఆపి, నీతి ఆయోగ్ చెప్పిన రూ. 24 వేల కోట్లు ఇవ్వకుండా, రాష్ట్రానికి డబ్బులు ఇవ్వకుండా ఆపి, ఇంకోవైపు రాష్ట్రంలోకి వచ్చి అది అమలైతలేదు.. ఇది అమలైతలేదు అని చెప్పి జీతాలు లేటు వస్తున్నాయని మాట్లాడటం మీ కుట్ర కాదా? దీనికి సమాధానం ఏంటి? బీజేపీ నాయకులు సభ పెట్టుకుంటే అభ్యంతరం లేదు. ఈ రాష్ట్రానికి మీరు చేసిన మేలు ఏంటో చెప్పాలని హరీశ్రావు నడ్డాను డిమాండ్ చేశారు.
అప్పుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదని హరీశ్రావు పేర్కొన్నారు. ఈ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చింది బీజేపీనే. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దేశంలో రూ. 56 వేల కోట్లు అప్పు ఉండే. ఇవాళ రూ. 1,35, 87, 893 కోట్లకు అప్పు చేరింది. 8 ఏండ్ల పాలనలో ఒక కోటి కోట్ల అప్పు చేసిండ్రు. ఏడాదికి దాదాపు రూ. 12 లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారు. నెలకు లక్ష కోట్ల అప్పు చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. మీరు అప్పుల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది అని హరీశ్రావు అన్నారు.
తెలంగాణ అద్భుతంగా పని చేస్తుంది. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ జీఎస్డీపీ రూ. 4 లక్షల 51 వేల కోట్లు. ఈ ఎనిమిదేండ్లలో రూ. పదంకొండున్నర లక్షల కోట్లకు జీఎస్డీపీ చేరింది. ఇది మన పనితీరుకు గీటురాయి. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం ఒక లక్ష 12 వేల 162 రూపాయాలు. గత సంవత్సరం తలసరి ఆదాయం 2 లక్షల 75 వేల 443 రూపాయాలు. తలసరి ఆదాయం రెట్టింపు అయింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు.. ఈ దేశ తలసరి ఆదాయం 79,118 రూపాయాలు ఉంటే మొన్న ఒక లక్ష 50 వేల 7 రూపాయాలు. అంటే దేశం కంటే మన పౌరుల తలసరి ఆదాయం ఒక లక్ష 25 వేల 436 రూపాయాలు అధికంగా ఉన్నది. ఇది మేం చెప్పే లెక్కలు కాదు.. కేంద్రం చెప్పిన లెక్కలు ఇవి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తలసరి ఆదాయం ఎందుకు పెరగలేదని హరీశ్రావు ప్రశ్నించారు.