సిద్దిపేట : మనమంతా జీతగాళ్లం.. నేనైనా.. నువ్వైనా.. ప్రజలకు జీతగాళ్లం. కాబట్టి మనం సేవ చేయాలి మనం. పేర్లు వేరు ఒకరు ఆశా, ఒకరు ఏఎన్ఏం, ఒకరు ఏఎంపీ, ఒకరు మంత్రి కావొచ్చు. నా జీతం రూ. 2 లక్షలు. స్టాఫ్ నర్సుగా నీ జీతం రూ. 77 వేలు. నెలలో ఒక్క కాన్పు చేస్తే ఎట్లా. నార్మల్ డెలివరీ చేయడానికి స్టాఫ్ నర్సు చాలు. భద్రాచలంలో వైద్యుడు లేకుండానే ఒక్కరే స్టాఫ్ నర్సు రోజుకు 20 డెలివరీలు చేస్తున్నారు. మనం కూడా నార్మల్ డెలివరీలు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వైద్యాధికారులు, సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు.
సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని భూoపల్లి పీహెచ్సీ నూతన భవన నిర్మాణ పనులకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావులతో కలసి గురువారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. ఈ మేరకు అక్కడి వైద్య అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.
మీ పీహెచ్ సీలో గర్భిణీలు ఎంతమంది.? వీరిలో ప్రభుత్వ, ప్రయివేటుకు ఎంతమంది వెళ్తున్నారు.? నార్మల్, సెక్షన్ ఎంత.? అని ఆరోగ్య కార్యకర్తలను మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. 35 మంది గర్భిణీలు.. ఒకరు మాత్రమే ప్రయివేటులో డెలివరీ అయ్యారని తెలిపారు. ఎంత కడుపు కోత అవుతుందో.. మీకు తెలియడం లేదని, మన ప్రజల్ని మనం కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజలతో మమేకంగా ఉండాల్సిన వాళ్ళం మనమే కదా. మనమే వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలని హరీశ్రావు సూచించారు. కరోనా సమయంలో చాలా కష్టపడి పని చేశారని ఓ వైపు అభినందించి, మరో వైపు బీపీ కంట్రోల్ చేయకపోతే కిడ్నీలు పాడవుతున్నాయని, షుగర్ మందులు, బీపీ మందులు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
పెద్ద ఆపరేషన్ చేసి, గర్భసంచి తీసే వ్యాపారం చేయొద్దని, దాన్ని కూడా బంద్ చేయించాలని, అర్థమయ్యేలా చెప్పాల్సిన వాళ్ళు మీరే కాబట్టి సాటి మహిళా ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత తీసుకుని ప్రభుత్వానికి, మీకు మీరు మంచి పేరు తెచ్చుకోవాలని హరీశ్రావు సూచించారు.
పీహెచ్సీ వైద్య అధికార సిబ్బంది వారీగా అక్కడికక్కడే సమీక్షిస్తూ.. ముగ్గురు ఉంటే.. మీ ఓపీ 21 ఉండటమేంటనీ ఆరా తీశారు. ఈ లెక్కన మీ విధులు ఏ పాటి నిర్వర్తిస్తున్నారో.. అర్థం అవుతున్నదని, రాత్రి పూట ఎవరైనా ఉంటున్నారా..? ముగ్గురు స్టాఫ్ నర్సులు ఉన్నారని రాత్రిపూట ఎవరూ ఉండటం లేదనే ఫిర్యాదు ఉందని మంత్రి పేర్కొన్నారు.
పాముకాటు, తేలు కాటు మందులు ఉన్నాయా..?సూదులు ఉన్నాయా..? కుక్కకాటుకు ఎవరైనా వస్తే వెంటనే ట్రీట్మెంట్ అందిస్తున్నారా.. ఫ్రిజ్ లో మందులు ఉన్నాయా.. చూడమంటరా..? అని ఆరా తీస్తూ.. పేషేంట్లు తక్కువ ఉద్యోగులెక్కువ.. 21 మంది స్టాఫ్ కు 21 మంది పేషేంట్లు ఉంటారా..అంటూ సుతిమెత్తగా మందలించారు. గత నెలలో ముగ్గురు స్టాఫ్ నర్సులు ఒకే కాన్పు చేయడమేంటనీ హరీశ్రావు ప్రశ్నించారు.