Harish Rao | హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్గా, మహిళగా తమిళిసై సౌందర్ రాజన్ను గౌరవిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. సచివాలయం ప్రారంభానికి గవర్నర్ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా..? అని సూటిగా ప్రశ్నించారు. వందే భారత్ రైలు ప్రారంభానికి రాష్ట్రపతిని ప్రధాని పిలిచారా..? వందే భారత్ రైలును ఎన్నిసార్లు ప్రారంభిస్తారని మేం అడిగామా..? ఎన్ని సార్లు.. ఎవరు ప్రారంభించాలో కార్యనిర్వాహక వ్యవస్థ ఇష్టం. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా గవర్నర్ ప్రవర్తన ఉంది. గవర్నర్ తమిళిసై వ్యవహార శైలి బాధ కలిగిస్తోంది అని హరీశ్రావు అన్నారు.
వైద్య విద్య ప్రొఫెసర్ల విరమణ వయసు పెంపు బిల్లు 7 నెలలు ఆపడం అవసరమా? అని హరీశ్రావు ప్రశ్నించారు. సుప్రీంకోర్టు మెట్లెక్కితే తప్ప బిల్లులపై కదలిక రాలేదన్నారు. రాష్ట్రంలో అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు లేరని పదవీ విరమణ వయసు పెంచామని తెలిపారు. వర్సిటీల ఉమ్మడి నియామకాలు ఇతర రాష్ట్రాలు చేపట్టడం లేదా? అని అడిగారు. ఈ బిల్లును 7 నెలలు ఆపి తిప్పి పంపడం ఎంత అన్యాయమని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేయడం కాదా? అని అడిగారు. రాష్ట్ర విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేయడమే అని హరీశ్రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పొడెం వీరయ్య వినతి పత్రం ఇచ్చారని.. భద్రాచలం విలీన గ్రామాల బిల్లును గవర్నర్ ఆపారని మంత్రి తెలిపారు. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? అని ధ్వజమెత్తారు.
నా ప్రభుత్వం అంటూనే గవర్నర్ వెన్ను పోటు పొడుస్తున్నారని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. పిల్లలకు విద్య, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలను గవర్నర్ దూరం చేస్తున్నారు. బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఎన్నో ఏండ్ల నుంచి యూనివర్సిటీ కామన్ రిక్రూట్ మెంట్ నడుస్తోంది. ఇక్కడ గవర్నర్కు దీనిపై ఎందుకు అభ్యంతరం అని ప్రశ్నించారు. నోటితో నవ్వుతూ నొసలితో గవర్నర్ వెక్కిరిస్తున్నారు. గతంలో 5 ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ ఇపుడు అలాంటి బిల్లునే అడ్డుకుంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రైవేట్ యూనివర్సిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అవి బీజేపీ పాలిత రాష్ట్రాలే కదా..? సిద్దిపేటలో వెటర్నరీ కాలేజీ మంజూరైంది. దానికి ప్రొఫెసర్ల కొరత ఉంది. గవర్నర్ ఆ బిల్లును అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం కాదా అని హరీశ్రావు ప్రశ్నించారు.
జీ 20కి సంబంధించిన సమావేశాల్లో గవర్నర్ తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బతీసేలా మాట్లాడారని హరీశ్రావు పేర్కొన్నారు. కేసీఆర్ గురించి ఆమె మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయి. కేసీఆర్ మామూలు వ్యక్తా.. ఇన్ని సార్లు రాజీనామా చేసి గెలిచిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? అని అడిగారు. గవర్నర్ ఎన్ని సార్లు పోటీ చేసినా గెలిచారా అని ప్రశ్నించారు. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం అనేది సామెత. గవర్నర్ అదే తెలుసుకోవాలి అని హరీశ్రావు సూచించారు. కేసీఆర్ ప్రజల మనిషి అన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు.
రజనీకాంత్ తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తి.. రాష్ట్ర ప్రగతిపై ఉన్నది ఉన్నట్లు మాట్లాడారు. ఆయనకు తెలిసిన విషయాలు కూడా గవర్నర్కు తెలియవా? అని ప్రశ్నించారు. పంచాయతీ, స్థానిక సంస్థల్లో అవిశ్వాసానికి నాలుగేళ్ల కనిష్ట పరిమితిని పెంచితే గవర్నర్కు ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. అభివృద్ధి కోణంలో ఆ నిర్ణయం తీసుకున్నాం. గవర్నర్ అలాంటి బిల్లును ఆపొచ్చా? అని అడిగారు. గవర్నర్ బీజేపీ కనుసన్నల్లో పని చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. గవర్నర్కు రాజకీయాలు ఇష్టముంటే మళ్లీ బీజేపీలో చేరి పోటీ చేయొచ్చు అని హరీశ్రావు సూచించారు.