ఎక్కడైనా ఒక మంచి పనిచేస్తే ప్రతిపక్షాలు స్వాగతిస్తయి.. లేకపోతే నోరు మూసుకుంటరు.. కానీ, మన రాష్ట్రంలో మాత్రం కోర్టుల్లో, గ్రీన్ ట్రిబ్యునళ్లలో కేసులు వేసి భూములు ఇయ్యకుండా రైతులను రెచ్చగొట్టిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, ఆ పార్టీ నాయకులది.
-మంత్రి హరీశ్రావు
Minister Harish Rao | సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 17: ప్రాజెక్టు పూర్తయి కాలువల్లో నీళ్లు పారుతుండగా పాలమూరు ప్రజల కండ్లల్లో ఆనందం కనిపిస్తుంటే.. కాంగ్రెస్ నాయకులకు కన్నీళ్లు వస్తున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. సమైక్య పాలనలో ఫండింగ్ లేక ప్రాజెక్టులను కాంగ్రెస్ పెండింగ్లో పెడితే.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ బృహత్ సంకల్పంతో వాటిని పూర్తి చేయించారని చెప్పారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లాకేంద్రంలోని కొండా భూదేవి గార్డెన్లో గృహలక్ష్మి పథకం ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేశారు. అంతకుముందు కలెక్టరేట్లో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యతా వేడుకల్లో పాల్గొన్నారు. కొత్త ఆసరా పింఛన్ లబ్ధిదారులకు ఉత్తర్వులు అందజేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల’ను ప్రారంభించుకోవడంతో పాలమూరు ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కృష్ణానది నీళ్లతో ప్రతి గ్రామంలో దేవతల విగ్రహాలకు అభిషేకాలు చేస్తున్నట్టు చెప్పారు.
సీఎం కేసీఆర్ పట్టుదలతో పెండింగ్ ప్రాజెక్ట్లతోపాటు కొత్త ప్రాజెక్ట్లను పూర్తిచేసి సాగు, తాగునీటి భరోసా కల్పించారని తెలిపారు. పాలమూరు జలాలు ఉబికి ఉబికి పైకి వస్తుంటే ఎంతో సంతోషం అనిపించిందని చెప్పారు. కరువు పీడిత ప్రాంతమైన పాలమూరుకు నీళ్లిస్తే.. కాంగ్రెస్ నాయకులు ఎకసెక్కాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కాలువల్లో నీళ్లు వస్తుంటే కూడా ఉత్తదే అని మాట్లాడుతున్నారని.. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమి ఉండదని విమర్శించారు. ప్రజల పట్ల కాంగ్రెసోళ్లకు ఉన్న చిత్తశుద్ధికి ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయి తే.. పాలమూరు-రంగారెడ్డితో ఎత్తిపోతలతో దక్షిణ తెలంగాణ పచ్చబడనున్నదని సంతోషం వ్యక్తంచేశారు. గృహలక్ష్మి కింద రూ.3 లక్షలు ఇంటి మహాలక్ష్మి పేరు మీద ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిపారు. ప్రతి రూపాయి సద్వినియోగం అవుతాయని పేర్కొన్నారు. అందరికీ ఒకేసారి ఇవ్వడం ఇబ్బందని, ముందు, వెనుక అందరికీ ఇస్తామని చెప్పారు. ‘అందరూ మనవాళ్లే.. ఉండేది మన ప్రభుత్వమే.. అందరికీ గృహలక్ష్మి ఇస్తాం’ అని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు.
తిట్టేటోళ్లు కావాల్నా.. కిట్టులిచ్చేటోళ్లు కావాల్నా?
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తిట్లలో పోటీ పడుతుంటే.. బీఆర్ఎస్ కిట్లు ఇవ్వడంలో, అభివృద్ధి చేయడంలో, సంక్షేమ పథకాలు అందించడంలో.. అన్నివర్గాలకు మేలు చేయడంలో పోటీ పడుతున్నదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ‘తిట్టేటోల్లు కావాల్నా? కిట్లు ఇచ్చేటోళ్లు కావాల్నా..? పని చేసేటోడు కావాల్నా? మాయ మాటలు చెప్పే వాళ్లు కావాల్నా?’ ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. అబద్ధాలు చెప్పే గోబెల్స్ వైపు ఉంటారా? పనిచేసే నోబెల్స్ వైపు ఉంటారా? ప్రజలు ఆలోచించాలని చెప్పారు. 50 ఏండ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ అలవి కానీ హామీలు ఇస్తున్నారని దుయ్యబట్టారు.
వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కూడా ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటలో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చిందని, ఇప్పుడు వాటిని అమలు చేసేందుకు అపసోపాలు పడుతున్నదని తెలిపారు. పనిచేసే వాళ్లను ఆశీర్వదిస్తే మరింత పని చేస్తామని అన్నారు. తొమ్మిదేండ్ల స్వరాష్ట్ర పాలనలో తెలంగాణ జీవన ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని.. పచ్చని పొలాలు, చక్కని మౌలిక వసతులతో శాంతికి నెలవుగా అలరారుతూ.. సర్వతోముఖాభివృద్ధ్ది సాధిస్తూ రాష్ట్రం ప్రగతి బాటలో పయనిస్తున్నదని తెలిపారు. 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారి రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని పేర్కొన్నారు. అందుకు యావత్తు తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిందని చెప్పారు. ఈ సందర్భంగా నాటి వీరయోధులైన మహానుభావులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు చెప్పారు.బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తిట్లలో పోటీపడుతుంటే.. బీఆర్ఎస్ పార్టీ కిట్ల పంపిణీలో, అభివృద్ధి చేయడంలో పోటీపడుతున్నది.
తిట్టేటోల్లు కావాల్నా? కిట్లు ఇచ్చేటోళ్లు కావాల్నా..? పని చేసేటోడు కావాల్నా? మాయ మాటలు చెప్పే వాళ్లు కావాల్నా? ప్రజలు తేల్చుకోవాలి.
కాంగ్రెస్ ప్రభుత్వంలో లంచాలు ఇచ్చినా ఇల్లు దక్కలేదు. తిరిగి తిరిగి కాళ్లు అరిగేవి. మన ప్రభుత్వంలో మధ్యవర్తులు, పైరవీలు లేకుండా.. గృహలక్ష్మి కింద డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పైసలు పడుతున్నయి. లంచం, మిత్తి, అప్పు అనే మాటే లేదు. ఎవరైనా డబ్బులు అడిగితే మాకు చెప్పండి.
-మంత్రి హరీశ్రావు
సమైక్య రాష్ట్రంలో తెలంగాణపై వివక్ష!
భారతదేశంలో అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుంచి 1956 వరకు సొంత రాష్ట్రంగా హైదరాబాద్ రాష్ట్రం కొనసాగిందని.. మిగులు నిధులు గల హైదరాబాద్ ఆనాడే అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని ముందుకు సాగిందని మంత్రి హరీశ్రావు వివరించారు. 1956లో రాష్ర్టాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా తెలంగాణ-ఆంధ్రాను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని ఏర్పాటు చేశారని.. కానీ, ఆంధ్ర వారి దోపిడీ విధానాలు, తెలంగాణ యాస, భాషలను చిన్న చూపు చూడటంతో ఆంధ్రప్రదేశ్ ఇరుప్రాంతాల మధ్య భావ సమైక్యత చోటు చేసుకోలేదని చెప్పారు. అందువల్లనే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దశాబ్దకాలంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసిపడిందని తెలిపారు. సమస్యలను పరిష్కరించాల్సిన నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్షను పట్టించుకోకుండా గాలికొదిలేసిందని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో దారుణమైన వివక్షకు గురైందని తెలిపారు.
2001లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కేసీఆర్ సారథ్యం వహించి, ఉద్యమశంఖం పూరించి తెలంగాణ ప్రజలందరినీ ఒక్కతాటి పైకి తెచ్చారని గుర్తుచేశారు. 14ఏండ్లు అవిశ్రాంత పోరాటాన్ని నడిపించి లక్ష్య సాధన కోసం మరణం అంచులదాకా వెళ్లారని చెప్పారు. తెలంగాణ ఉద్యమం తీవ్రం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం దిగొచ్చిందని, దీంతో 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని వివరించారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో దేశానికి మార్గదర్శకంగా మారిందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.