సంగారెడ్డి : భారతీయ జనతా పార్టీ నాయకులపై ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పేరుతో కొత్త నాటకం మొదలు పెట్టారని మండిపడ్డారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోవడం దారుణమన్నారు. బీజేపీ హయాంలో సిలిండర్ ధర రూ. 1000కి చేరుకుందని తెలిపారు. కోతలు, వాతలు తప్ప బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని హరీశ్రావు విరుచుకుపడ్డారు.
పటాన్చెరులో మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి యాదవ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. మెదక్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 1,072 ఓట్లు ఉంటే.. టీఆర్ఎస్ పార్టీకి 777 సభ్యుల మద్దతు ఉందన్నారు. బలం లేకపోయినా కాంగ్రెస్ పోటీలో ఉందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వo రూ. 500 కోట్లను స్థానిక సంస్థల కోసం కేటాయించిందని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసింది అని మండిపడ్డారు. టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని హరీశ్రావు స్థానిక ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.