నిజామాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ ద్వారా దేశ యువతను అంధకారంలోకి నెట్టేసే ప్రయత్నం జరుగుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. దేశం కోసం సేవ చేసే ఆర్మీ జవాన్లపై కూడా బీజేపీ రాజకీయాలు చేయడం దారుణమన్నారు. రూ. 1.30 కోట్ల వ్యయంతో నిర్మించిన మోతె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్రావు ప్రసంగించారు. ఆర్మీ ఉద్యోగాలను కూడా ప్రైవేటీకరణ చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. అగ్నిపథ్ స్కీమ్ సరికాదని ప్రశ్నించిన నిరుద్యోగ యువతపై కాల్పులు జరపడం సరికాదన్నారు. బీజేపీ ఓ తెలంగాణ బిడ్డను పొట్టన పెట్టుకున్నదని తెలిపారు. సికింద్రాబాద్ విధ్వంసం టీఆర్ఎస్ పార్టీ వల్ల జరిగిందని బండి సంజయ్ వ్యాఖ్యానించడం సరికాదు.. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు జరుగుతున్నాయి. అవి మీరే చేయించుకుంటున్నారా? అని బండి సంజయ్ను హరీశ్రావు సూటిగా ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షలను, ఆశలను బీజేపీ ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోతుందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందున్నప్పటికీ.. సాధారణ ప్రసవాల్లో వెనుకబడి ఉందని మంత్రి హరీశ్రావు తెలిపారు. సాధారణ ప్రసవాలపై గ్రామాల్లో అవగాహన కల్పించారు. 34 శాతం పిల్లలకు మాత్రమే మొదటి గంటలో తల్లిపాలు అందుతున్నాయి. 66 శాతం మంది పిల్లలకు మొదటి గంటలో తల్లిపాలు అందడం లేదు.. ఇందుకు సీజేరియన్ ఆపరేషన్లే కారణమని పేర్కొన్నారు. మొదటి గంటలో తల్లిపాలు తాగిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని మంత్రి స్పష్టం చేశారు. మోతెలో 15 కాన్పులు జరిగితే ఇందులో 12 పెద్ద ఆపరేషన్లు, మూడు మాత్రమే సాధారణ డెలివరీలు అయ్యాయని తెలిపారు. పిల్లల భవిష్యత్తో పాటు తల్లి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని మంత్రి హరీశ్రావు సూచించారు.