నారాయణ్పేట : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఒక వేళ అధికారంలోకి వచ్చినా అరచేతిలో వైకుంఠం చూపిస్తారని పేర్కొన్నారు. నారాయణ్పేట జిల్లాలో పర్యటించిన మంత్రి హరీశ్రావు.. రూ. 56 కోట్లతో 390 పడకల ఆస్పత్రికి, రూ. 1.25 కోట్లతో టీ డయాగ్నోస్టిక్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఇక ఎర్రగుట్ట నుంచి ఎక్లాస్ మీదుగా తెలంగాణ – కర్ణాటక సరిహద్దు వరకు రూ. 5.98 కోట్లతో 5.5 కిలోమీటర్ల మేర నిర్మించిన రోడ్డును, కొత్తగా ఏర్పాటు చేసిన డయాలసిస్ యూనిట్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. నారాయణ్పేట జిల్లాలో 390 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు శంకుస్ధాపన చేసుకోవడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. ఇది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి గతంలో నాగం జనార్థన్ రెడ్డి, డీకే అరుణ మంత్రులుగా పని చేశారు. కానీ ఒక్క మెడికల్ కాలేజీ కూడా సాధించలేకపోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం మొత్తం 4 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిందన్నారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా పేదలకు డయాలసిస్ సేవలు అందేలా డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. స్థానికుల కోరిక మేరకు నారాయణ్పేటలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నర్సింగ్ కాలేజీని అందుబాటులోకి తీసుకొస్తామని హరీశ్రావు స్పష్టం చేశారు.
కర్ణాటకలో రైతులకు కనీసం 6 గంటల పాటైనా కరెంట్ ఇస్తున్నారా? అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. మీరు సరిహద్దు ప్రాంతంలో ఉన్నారు కాబట్టి.. మీకే బాగా తెలియాలని స్థానికులను ఉద్దేశించి ఆయన అన్నారు. తెలంగాణలో మాత్రం 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ను అందిస్తున్నామని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు సరిపడా విద్యుత్ ఎందుకు ఇవ్వడం లేదన్నారు.
బండి సంజయ్ పాదయాత్ర చేస్తాను అంటే ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని హరీశ్రావు పిలుపునిచ్చారు. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీరు ఇచ్చిన హామీలు అమలు చేసి మాట్లాడాలని, అలా సంజయ్ను నిలదీయాలని సూచించారు. బండి ఏ ముఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నారు.. వడ్ల కుప్పల వద్దకు ఎందుకు వెళ్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.