Minister Harish Rao | దేశ పాలకుల ఇది అమృత్ కాలమైతే.. దేశ ప్రజలకు మాత్రం కనీసం తాగునీరు దొరకని ఆపద కాలమని మంత్రి హరీశ్రావు అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకంతో దేశం ముందు ఓ మోడల్ను పెట్టింది. దీన్ని చూసి కూడా మిగతా రాష్ట్రాలు ఎందుకు చేయలేకుపోతున్నయ్. నిధులు లేకనా? నీళ్లు లేకనా? అసలు విషయం ప్రజల పట్ల ప్రేమ, మమకారం లేకపోవడం ఏ రాష్ట్రంలో తెలంగాణ తరహాలో పథకాలు అమలుకావడం లేదు.
దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలకు రాజకీయాలంటే ఒక గేమ్. కానీ, సీఎం కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి పాలిటిక్స్ ఒక టాస్క్. ఏ లక్ష్యాన్ని అయినా పట్టుదలతో దాన్ని పూర్తి చేసేలా ప్రజల కోణంలో, మానవీయ కోణంలో పని చేసే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. మిషన్ భగీరథలో 1.50లక్షల కిలోమీటర్ల పైప్లైన్, 37వేల వాటర్ ట్యాంక్లు, 1804 సర్వీస్ రిజర్వాయర్లు, 123 వాటర్ ట్రీట్మెంట్ పాంట్లు, 77 ఇంటెక్ వెల్స్ వీటన్నింటిని మూడునాలుగేళ్లలో పూర్తి చేయడం ఓ భగీరథ యత్నం. సీఎం కేసీఆర్ ఒక టాస్క్గా తీసుకోవడంతోనే ఇది సాధ్యమైంది. ఇది మాకు మిగతా పార్టీలకు ఉన్న తేడా’ అన్నారు.
‘రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిపాలన, దేశంలో మోదీ నాయకత్వంలో బీజేపీ పరిపాలన ఒకేసారి ప్రారంభమయ్యాయి. అధికారంలోకి ఆరేడేళ్లలోనే 2020 నాటికి మిషన్ భగీరథను పూర్తి చేశాం. కేంద్ర జల్జీవన్ మిషన్ 2022లో మిషన్ భగీరథలో ఇంటింటికి మంచినీరు ఇచ్చినందుకు రాష్ట్రానికి అవార్డు ఇచ్చింది. మన పథకాన్ని ‘హర్ఘర్కో జల్’ పేరుతో కాపీ కొట్టారు కానీ.. స్పీడ్గా పనులు చేయడం లేదు. కేసీఆర్ తెచ్చిన పథకాన్ని తీసుకువస్తే కేంద్రం దీన్ని దేశమంతా అమలు చేయడం రాష్ట్రానికి గర్వకారణం. దేశ ప్రజలకు సురక్షితమైన తాగునీరు ఇవాళ 49శాతం మందికి మాత్రమే అందుతుంది.
స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా 75 సంవత్సరాలు అమృత్కాలమని గొప్ప చెప్పుకుంటున్నారు. ఇంకా 51శాతం మంది ప్రజలు కనీస సౌకర్యమైన తాగునీటికి దూరంగా ఉన్నారు. తెలంగాణ సక్సెన్ను కలుపుకొని కేవలం 49శాతం మందికి మాత్రమే స్వచ్ఛమైన తాగునీరు అందిస్తుంది. మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రూ.44,933.66 కోట్లఅంచనా వ్యయంతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. కానీ, ప్రాజెక్టు పూర్తయ్యే వరకు చేసిన వాస్తవమైన వ్యయం రూ.36,900 కోట్లు మాత్రమే. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో ఖచ్చితమైన ప్రణాళికతో పారదర్శకంగా ఆధునిక పద్ధతులను వినియోగించి నిర్ణీత సమయంలో పథకాన్ని పూర్తి చేయడం వల్ల రూ.8,033.66 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం ఆదా చేయగలిగింది’ అని హరీశ్రావు వివరించారు.