హైదరాబాద్ : ఎంబీబీఎస్ సీట్లు సాధించినా.. ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్న అన్నాచెల్లెళ్లకు ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అండగా నిలిచారు. ఇద్దరు వైద్య విద్యార్థులు ఉన్నత చదువులు కొనసాగేలా భరోసా ఇచ్చారు. ములుగు జిల్లాకు చెందిన షేక్ షబ్బీర్ తన ఇద్దరు పిల్లలు డాక్టర్లు కావాలని తపించారు. అయితే, గత ఏడాది కరోనాతో షేక్ షబ్బీర్ మరణించారు. దీంతో ఆ కుటుంబం దిక్కులేనిదయింది. అయినా పిల్లలు ఇద్దరు షేక్ షోయబ్, సానియా అధైర్యపడలేదు. తండ్రి ఆశయాన్ని సాధించేందుకు కష్టపడి ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. సానియాకు కాకతీయ మెడికల్ కాలేజీలో, షోయబ్కు రంగారెడ్డి జిల్లాలోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది.
అయితే.. పిల్లలిద్దరినీ చదివించే స్థోమత లేకపోవడంతో తల్లి జాహిరా బేగం దాతలను ఆశ్రయించింది. ఈ విషయం ఆర్థిక వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు దృష్టికి రావడంతో తక్షణం స్పందించారు. ఆ కుటుంబానికి అండగా నిలిచారు. అన్నా చెల్లెళ్ల వైద్య విద్య కొనసాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో జాహిరా బేగం, ఇద్దరు పిల్లలు శనివారం హైదరాబాద్లో మంత్రి హరీశ్రావును కలిసి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బాగా చదవాలని.. మంచి వైద్యులు కావాలని, పేదలకు సేవ చేయాలని షోయబ్, సానియాకు మంత్రి సూచించారు. వైద్యులు కావాలనే తమ కలను సాకారం చేసుకునేందుకు అండగా నిలిచారంటూ ఆనందంతో మంత్రి హరీశ్రావుకు ధన్యవాదాలు తెలిపారు.