సిద్దిపేట: మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేశారు. సిద్దిపేటలోని ఆర్వో కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు సిద్దిపేట వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం పట్టణంలో ఈద్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేసి ఆర్వో కార్యాలయానికి బయల్దేరారు.
కాగా, మంత్రి హరీశ్ రావు 2004 నుంచి సిద్దిపేటకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో 24,827 మెజార్టీతో విజయం సాధించారు. 2008 ఉప ఎన్నికల్లో 58,935 మెజార్టీతో గెలుపొందారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో తన మెజారిటీని పెంచుకుంటూ వెళ్తున్నారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64,014 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేసిన ఆయన.. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 95,858 ఆధిక్యంతో విజయం సాధించారు. ఇత తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో 93,328 ఓట్ల మెజారిటీ, 2018 ఎన్నికల్లో 1,18,699 మెజార్టీతో విజయం సాధించి ప్రత్యర్థి పార్టీలకు కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా చేశారు.