పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎంత సురక్షితంగా ఉంటుందో.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రాష్ట్రం సీఎం కేసీఆర్ చేతుల్లో ఉంటేనే బాగుంటుంది. తెలంగాణ తెచ్చిన ఆయన చేతుల్లో పదిలంగా ఉంటుంది.
-మంత్రి హరీశ్
Minister Harish Rao | సిద్దిపేట/మెదక్/దుబ్బాక/ నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): తాము అధికారంలోకి వస్తే వ్యవసాయానికి మూడు గంటలు మాత్రమే కరెంటు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, అది సరిపోతుందా? అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ఖర్మకాలి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమవుతుందని హెచ్చరించారు. గురువారం సిద్దిపేటలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు గజ్వేల్లో సీఎం కేసీఆర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం దుబ్బాకలో కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్లో పద్మాదేవేందర్రెడ్డి నామినేషన్ల కార్యక్రమాల్లోనూ పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేదని, బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు కష్టాలు మళ్లీ మొదలవుతాయని, కాబట్టి రిస్క్ తీసుకోవద్దని ఓటర్లకు సూచించారు.
కాంగ్రెస్ పార్టీ టికెట్లను తక్కెట్లో పెట్టి అర్రాస్ పాట లెక్క అమ్ముకొంటున్నదని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. రాష్ట్రం వీళ్ల చేతుల్లోకి వెళ్తే కుక్కలు చింపిన విస్తరి అయిపోతుందని హెచ్చరించారు. సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయని, ఎవరెన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు కేసీఆర్ను, గులాబీ జెండానే నమ్ముతారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాకుంటే కాళేశ్వరం వచ్చేది కాదని, 24 గంటల కరెంట్ ఉండేది కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ రైతుబంధును అవమానిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం సీఎం కేసీఆర్ మరోమారు అద్భుతమైన మ్యానిఫెస్టోను తయారుచేశారని ప్రశంసించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు గడపగడపకు వెళ్లి మ్యానిఫెస్టోను వివరించాలని కోరారు. ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేసే బీఆర్ఎస్కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతీ కార్యకర్త కథానాయకుడు కావాలని, దుబ్బాకలో కొత్త ప్రభాకర్రెడ్డిని 50 వేల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఎన్నికలు ఉండడంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు, మంత్రులు ఢిల్లీ నుంచి, కర్ణాటక నుంచి వచ్చి తెలంగాణను చుట్టముడుతున్నారని, ఎన్నికలు ముగిసిన మరుక్షణం వారందరూ మాయమైపోతారని విమర్శించారు. ప్రజల కష్టాసుఖాల్లో పాలుపంచుకొనేది బీఆర్ఎస్ నేతలు మాత్రమే పేర్కొన్నారు. బీఆర్ఎస్ సర్కారు మాత్రమే తెలంగాణ ప్రజల వైపు ఉంటుందని, ప్రతిపక్షాల మోసపూరిత మాటలు విని మోసపోవద్దని, కారుగుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి హరీశ్రావు కోరారు.