హైదరాబాద్ : నిజం గడప దటకముందే అబద్ధం.. ఊరంతా చుట్టి వచ్చినట్టు వైద్యారోగ్య శాఖలో మంచి బయటకు రావడం లేదని, చెడు మాత్రమే ప్రచారమవుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అందుకే మంచిగా పనిచేసే సిబ్బందిలో కొందరిని సన్మానించాలని నిర్ణయించామని, ఆశా మొదలు.. అన్ని స్థాయిల సిబ్బందిని గుర్తించామన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గాంధీ మెడికల్ కాలేజీలో ఉత్తమ వైద్యులు, సిబ్బందికి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యారోగ్యశాఖలోని సిబ్బంది ఓ కుటుంబంలా ఒకే చోట కలవడం సంతోషంగా ఉందన్నారు.
ప్రతి వ్యవస్థలో మంచి, చెడు ఉంటాయన్నారు. కొవిడ్ తర్వాత ప్రభుత్వాలు ఆరోగ్య రంగంపై దృష్టి పెట్టాయని.. అభివృద్ధిలో సాటి లేదనే అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు సైతం శవాల దిబ్బలు చూశాయని, మన దేశంలో బాగా మేనేజ్ చేయగలిగామన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్తులు వస్తే ఎదుర్కొనేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యరంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారని, ఇందులో భాగంగానే మెడిల్ కాలేజీలను 3 నుంచి 33కు పెంచినట్లు చెప్పారు. మాటలు చెప్తే కాదు.. నిధులు కూడా ఇస్తేనే మార్పు సాధ్యమన్నారు. అందుకే బడ్జెట్ను రూ.6295 నుంచి ఈ సారి రూ.11,440 కోట్లకు పెంచినట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి ఏపీలో ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రాలేదని.. ఇప్పుడు నాలుగు టిమ్స్, నిమ్స్లో 40 ఎకరాల స్థలంలో 2వేల పడకలతో విస్తరణ, వరంగల్లో హెల్త్ సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి ఏడేళ్లలో జరిగిందన్నారు. సూపర్ స్పెషాలిటీ సీట్లను పెంచేందుకు, ఈ హాస్పిటల్లో టీచింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు పెంచి భవిష్యత్ సమాజానికి డాక్టర్లను అందిస్తున్నామన్నారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు కన్న తల్లిలా సేవ చేస్తున్నాయని.. రోగి ఎలా ఉన్నా.. ఎలాంటి స్థితిలో ఉన్నా.. అక్కున చేర్చుకుంటుయన్నారు.
రాష్ట్రంలో ఆరోగ్య రంగంలో సేవలకు కేంద్రం అనేక అవార్డులను ఇచ్చిందని, నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో 3వ స్థానం.. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో రెండు అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుప్రతుల్లో 54శాతం డెలివరీలు అవుతున్నాయని, నా టార్గెట్ 70-75శాతమన్నారు. నార్మల్ డెలివరీలు పెరగాలని, ముహూర్తాలు చూసుకొని ఆపరేషన్ చేయించుకుంటున్నారని.. ఇది చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్లో ‘సీ’ సెక్షన్లపై ఆడిట్ నిర్వహిస్తామని.. తగ్గకపోతే సంబంధిత డాక్టర్లపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ హాస్పిటల్లో నార్మల్ డెలివరీ చేస్తే ఇన్సెంటివ్ పెంచుతున్నామన్నారు. ఎనీమియా ఎక్కువగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అమలు చేస్తున్నట్లు వివరించారు.