సిద్దిపేట అర్బన్/సిద్దిపేట జోన్, మే 29: ఇంటిపెద్దను కోల్పోయి, సొంతిల్లు లేక శ్మశానవాటికలో తలదాచుకుంటున్న కొవిడ్ బాధిత కుటుంబానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు కొండంత అండగా నిలిచారు. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరుచేయడంతోపాటు తక్షణసాయంగా రూ.10 వేలు, నెలకు సరిపడా సరుకులు ఇప్పించారు. సిద్దిపేట పట్టణానికి చెందిన కొత్వాల్ శ్రీనివాస్ క్షౌరవృత్తితో కుటుంబాన్ని పోషించుకొనేవాడు. ఇటీవల కరోనా బారినపడటంతో హోమ్ ఐసొలేషన్లో ఉంటూ మూడురోజుల క్రితం మృతిచెందాడు. ఆ ఇంట్లో ఉండటానికి వీల్లేదని యజమాని స్పష్టం చేయడంతో శ్రీనివాస్ భార్య సుజాత, కుమారుడు రుచిత్, కూతురు దీక్ష శ్రీరామకుంట శ్మశానవాటికలో తలదాచుకుంటున్నారు. శనివారం ట్విట్టర్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్రావు తక్షణమే స్పందించారు. సిద్దిపేట అర్బన్ తాసిల్దార్ విజయ్సాగర్ను అక్కడికి పంపించారు. వారితో మంత్రి హరీశ్రావు ఫోన్లో మాట్లాడి మనోధైర్యం కల్పించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సిద్దిపేట కేసీఆర్నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరుచేస్తున్నట్టు తెలిపారు. అనంతరం మంత్రి ఆదేశాలతో అర్బన్ తాసిల్దార్ విజయ్సాగర్, డిప్యూటీ తాసిల్దార్ రాజేశం శ్మశానవాటికలో ఉంటున్న వారిని తీసుకెళ్లి, కేసీఆర్నగర్లోని 127వ బ్లాక్లో డబుల్ బెడ్రూం ఇల్లు అప్పగించారు.