మర్రిగూడ, అక్టోబర్ 19: తెలంగాణ ప్రజల వెన్నంటి ఉంటూ కండ్ల ముందు ఉండే టీఆర్ఎస్ కావాలో, ఢిల్లీలో ఉండే బీజేపీ కావాలో ఆలోచించుకోవాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మునుగోడు ప్రజలను కోరారు. ఎన్నికలు అయిపోగానే ఢిల్లీ బీజేపీ నాయకులు వరుసకట్టి వెళ్లిపోతారని, ఇక్కడ ఉండేది కేసీఆర్, టీఆర్ఎస్ పార్టేనని అన్నారు. మునుగోడులో రాజగోపాల్రెడ్డి గెలిస్తే ఒక వ్యక్తికే లాభం కలుగుతుందని, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలిస్తే మునుగోడు ప్రజలందరికీ మేలు జరుగుతుందని అన్నారు.
బుధవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం రాజపేటతండాలో గిరిజనులతో నిర్వహించిన గ్రామసభలో మంత్రి పాల్గొని వారితో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం 3,146 తండాలను పంచాయతీలుగా మార్చడంతో గిరిజన బిడ్డలు సర్పంచ్లు అయ్యారని చెప్పారు. గిరిజన రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడమే కాకుండా ఆత్మగౌరవ భవనాలు నిర్మించి తగిన ప్రాధాన్యం కల్పించామని తెలిపారు. 10 శాతం రిజర్వేషన్ వల్ల ఎంబీబీఎస్లో 6,615 సీట్లకు 661 సీట్లు గిరిజన విద్యార్థులకు దక్కనున్నాయని చెప్పారు.
రూ.18 వేల కోట్ల కాంట్రాక్టుల కోసం బీజేపీకి అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మునుగోడు ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయని అభివృద్ధి బీజేపీతో ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉపఎన్నికలు అనగానే ఝూటా బీజేపీ గోబెల్స్ ప్రచారానికి తెరలేపుతున్నదని విమర్శించారు. మునుగోడులో బీజేపీని గెలిపిస్తే వృద్ధులకు రూ. 3వేల పింఛన్ ఇస్తామని ఆ పార్టీ నేతలు చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో రూ.750 పింఛన్ ఇస్తుంటే.. ఇక్కడ రూ.3 వేలు ఎట్ల ఇస్తరని ప్రశ్నించారు. దుబ్బాక, హుజూరాబాద్ ప్రజలు బీజేపీని ఎందుకు గెలిపించామా అని బాధపడుతున్నారని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ కృష్ణా జలాలు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ సర్కారుదేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెండు మోహన్రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి, సర్పంచ్ సక్కుబాయి బిచ్చునాయక్, మాజీ ఎంపీటీసీ రామన్న, గిరిజన సంఘం మండలాధ్యక్షుడు గోపీనాయక్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జయప్రసాద్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.