Minister Harish Rao | స్వచ్ఛ సిద్ధిపేటలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని మల్లయ్య గార్డెన్స్లో ఆదివారం ముస్లింలకు రంజాన్ కానుకల పంపిణీ కార్యక్రమం జిరగింది. కార్యక్రమానికి మంత్రితో పాటు ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ హాజరై ముస్లింలకు కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా రంజాన్ పండుగ నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వమే దుస్తుల పంపిణీ చేయడం, ఎమ్మెల్యేలు, మంత్రులు, స్వయంగా సీఎం కార్యక్రమాల్లో పాల్గొనడం మీరు గతంలో ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా..? తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో రంజాన్ పండుగను ప్రభుత్వం అధికారికంగా జరిపిస్తున్నదని చెప్పారు.
పిల్లలను మంచిగా చదివించాలని, మైనార్టీల సంక్షేమానికి అనేక రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసిందన్నారు. మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో కొన్ని ఖాళీలు మిగిలే ఉన్నాయని, వాటిని కూడా భర్తీ చేసి సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. అన్నింటా అభివృద్ధిలో సిద్దిపేట ముందుందని, తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని, యూజీడీ వచ్చాక దోమల బాధ తీరిందని, ఇల్లు శుభ్రంగా ఉంటే సరిపోదు, మీ వీధి, పట్టణం శుభ్రంగా ఉండాలన్నారు. ఇందు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా స్వచ్ఛ సిద్ధిపేటలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పలుచోట్ల పలువురిలో మార్పు రాని కారణంగా అక్కడక్కడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వారు కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు.
ఇంటి ముందుకు వచ్చే చెత్త వాహనాలకు అందివ్వాలని కోరారు. షాదీ ముబారక్ ద్వారా లక్ష సహాయం చేస్తున్నట్లు, ఇతర ప్రభ్యుత్వాలు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని, సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలను పూర్తిగా పరిష్కరించడం జరిగిందని, అన్నీ రకాల సేవలకు వైద్యులు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. 200 మంది వైద్యులు అందుబాటులో ఉన్నారని, పేదలు ప్రైవేటుకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులకు గురికావొద్దన్నారు. కోమటి చెరువును సుందరంగా తీర్చిదిద్దినట్లు, గతంలో సెలవుల్లో హైదరాబాద్ వెళ్లే వారని, ఇప్పుడు వారే సిద్ధిపేటకు వస్తున్నారని తెలిపారు.
ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ ఇప్పటికే మైనార్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తుందని, రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ కార్యక్రమాలు చేపట్టనుందని తెలిపారు. చదువు కోవటం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని, పాఠశాలలో అనేక సౌకర్యాలను ప్రభ్యుత్వం కల్పించిందని, ఆరోగ్యం కోసం ఆలోచించాల్సిన అవసరం ఉందని, దేశంలోనే తెలంగాణలో మైనారిటీల సంక్షేమం శాంతియుతంగా కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ అనంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్లు రియాజ్, మోయిజ్, వజీర్, ఆర్టీఏ మెంబర్ ఇర్షద్ హుస్సేన్ పాల్గొన్నారు.