సిద్దిపేట : భగవంతున్ని ఎంత భక్తితో పూజిస్తామనేది ముఖ్యం కానీ, రంగులు ముఖ్యం కాదు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడిన రంగురంగుల వినాయకులు పర్యావరణానికి విఘతం కలిగిస్తాయి. అందరూ మట్టి వినాయకులనే పూజించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని గాంధీ చౌక్లో అమర్నాథ్ అన్నదానం ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేసి మాట్లాడారు.
మంచు కొండలలో దక్షిణ భారతదేశం వారికే కాకుండా ఉత్తర భారతదేశం వారికి కూడా ఉచితంగా అన్నదానం చేస్తూ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆదర్శంగా నిలుస్తున్నదని ప్రశంసించారు. సమితి సేవలను గుర్తించి అయోధ్య రామాలయ నిర్మాణ ట్రస్ట్ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా అన్నదానం చేసేందుకు సంస్థకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది. ఇది మన అందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.
అమర్నాథ్ అన్నదాన సేవా సమితి భవన నిర్మాణానికి స్థలం సేకరించడం పూర్తయింది. త్వరలోనే భవన నిర్మాణాన్ని ప్రారంభించుకుందాం. ఈనెల 3, అక్టోబర్ ఒకటి, రెండు తేదీలలో చాగంటి కోటేశ్వరరావు సిద్దిపేటలో ప్రవచనాలు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు పాల సాయిరాం, నిత్య అన్నదాన సమితి సభ్యులు పాల్గొన్నారు.