Minister Harish Rao | సిద్దిపేట : సిద్దిపేట జిల్లా వర్గల్ పరిధిలో టీఎస్ఐఐసీ( TSIIC ) కింద భూములు కోల్పోయిన 39 మంది నిర్వాసితులకు 59 జీవో కింద ఇండ్ల స్థలాలకు సంబంధించిన పట్టా సర్టిఫికెట్లను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అందజేశారు. భూ నిర్వాసితులకు ఇచ్చిన మాట ప్రకారం.. స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పూర్తి చేసి సర్వహక్కులు మీకు కల్పించి ధృవీకరణ పత్రాలు అందిస్తున్నాం.. దయచేసి ఈ ప్లాట్లను విక్రయించొద్దని నిర్వాసితులకు హరీశ్రావు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. వర్గల్లోని టీఎస్ఐఐసీ భూ నిర్వాసితులు ఏ ఒక్కరూ మిగలకుండా అందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. మానవతా దృక్పథంతో నిర్వాసితులు అందరికీ సాయం అందించాలని ఆర్డీఓ విజయేందర్ రెడ్డిని మంత్రి ఆదేశించారు. మరో మూడు, నాలుగేండ్లలో మీ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. వర్గల్ ప్రాంతంలో కోకాకోలా, అమూల్ డైరీ, మస్కటీ డైరీ, సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, అతిపెద్ద రైస్ మిల్లులు రానున్నాయని, దీంతో చాలామంది ఉద్యోగ, ఉపాధి పొందవచ్చునని వివరించారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ నిర్వాసిత కుటుంబాలను గుర్తించాలని, వారికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు ఇచ్చి ఉపాధి, ఉద్యోగం పొందేలా చూడాలని జిల్లా కలెక్టర్కు మంత్రి సూచించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.