ములుగు: గిరిజన యూనివర్సిటీలో 90 శాతం సీట్లు ఎస్టీలకు కేటాయించాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. గిరిజనులకు ఏడున్నర శాతం సీట్లు మాత్రమే కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ములుగులో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్తో కలిసి తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ చాలా ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమని చెప్పారు. ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ములుగు జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు దేశానికే ఆదర్శంగా ఉంటాయని చెప్పారు.
40 రోజుల్లో ములుగు జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ పూర్తిచేస్తామని వెల్లడించారు. అన్ని రకాల పరీక్షలు చేసి డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని, వివరాలన్నీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. దీనిద్వారా రోగికి వైద్యులు వేగంగా సేవలు అందించడానికి అవకాశ ఉంటుందని తెలిపారు. ములుగులో రూ.42 కోట్లతో 250 పడకల దవాఖానకు శంకుస్థాపన చేసుకున్నామని వెల్లడించారు.
తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. గిరిజన యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం రూ.20 కోట్లు ఇచ్చిందని చెప్పారు. గిరిజనులకు ఏడున్నర శాతం సీట్లు మాత్రమే కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకే గిరిజన యూనివర్సిటీయా అని ప్రశ్నించారు. గిరిజనులకు 90 శాతం సీట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.