హైదరాబాద్: విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సుమారు 800 సినిమాలలో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి నవరస నటసార్వభౌముడిగా తెలుగుచలన చిత్ర పరిశ్రమలో వెలుగొందారని కొనియాడారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కైకాల సత్యనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆయన మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 777 సినిమాల్లో విలక్షణ పాత్రల్లో నటించిన కైకాల.. ప్రేక్షకుల గుండెల్లో చిరస్తాయిగా నిలిచిపోతారని చెప్పారు. కైకాల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం ప్రకటించారు. చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన వైవిధ్యమైన నటన ద్వారా మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని గుర్తుచేసుకున్నారు.
కైకాల మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు.
ఘటోత్కచుడిగా సినీ అభిమానులను మెప్పించి, 777 చిత్రాలలో నటించిన కైకాల సత్యనారాయణ మృతి చిత్రసీమకు, అభిమానులకు తీరని లోటని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
విలక్షణ నటుడిగా పేరొందిన కైకాల సత్యనారాయణ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సుమారు 800 సినిమాలలో విలక్షణమైన పాత్రలు పోషించి గొప్ప నటుడిగా ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.