Harish Rao | హైదరాబాద్ : అదానీ( Adani ) వాదం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. లేని పరివార వాదం గురించి మాట్లాడడం మోదీకే చెల్లిందని మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) మండిపడ్డారు. ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి వచ్చినట్లు లేదు. తెలంగాణపై తన కడుపులోని విషాన్ని కక్కడానికి వచ్చినట్లు ఉందని హరీశ్రావు ధ్వజమెత్తారు.
మోదీ మాట్లాడిన ప్రతీ మాట సత్య దూరం. ప్రధానిగా ఇన్ని అబద్ధాలు ఆడడం ఆయనకే చెల్లిందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆసరా పెన్షన్, రైతు బంధు వంటివి నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ అవుతున్నాయి. తన వల్లే డిబిటి మొదలైనట్టు అనడం పచ్చి అబద్దం. ఇందులో గొప్ప చెప్పుకోవాల్సింది ఏముంది? అని హరీశ్రావు ప్రశ్నించారు.
రైతు బంధును కాపీ కొడితే పీఎం కిసాన్ అయ్యింది. పీఎం కిసాన్ వల్లే మొదటి సారి రైతులకు లబ్ది అని చెప్పుకోవడం సిగ్గు చేటు. రైతు బంధుతో పోల్చితే పీఏం కిసాన్ సాయమెంత? అని మంత్రి నిలదీశారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు చేయూత ఇస్తున్నాం అని చెప్పడం పూర్తి అవాస్తవం అని పేర్కొన్నారు. ఐటీఐఆర్ను బెంగళూరుకు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన వెంటనే గుజరాత్లో అర్బిట్రేషన్ సెంటర్ పెట్టారు. తెలంగాణ ధాన్యాన్ని కొనకుండా రైతుల కంట కన్నీరు పెట్టించారు. ఇవన్నీ చేసింది మీ ప్రభుత్వం కాదా..? అని మోదీని ఉద్దేశించి హరీశ్రావు ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందించడం లేదని మోదీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని హరీశ్రావు పేర్కొన్నారు. నిజానికి ఈ పరిస్థితి రివర్స్గా ఉంది. రాష్ట్రానికి రావాల్సిన గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, జాతీయ హోదా వంటివి ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు ఎలాంటి సహకారం అందించడం లేదు అని హరీశ్రావు తెలిపారు.