సంగారెడ్డి అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బిడ్డ సీఎం కేసీఆర్ను ఓడిచేందుకు కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీలో చేతులు కలిపాయని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. మునుగోడు ఎమ్మెల్యే రాజ్గోపాల్ రాజీనామాతో ఆ రెండు పార్టీల చీకటి ఒప్పందం బట్టబయలైందని అన్నారు. తెలంగాణపై విషం కక్కే కాంగ్రెస్, బీజేపీ ఒకవైపు ఉంటే, తెలంగాణ ప్రజల గురించి నిరంతరం ఆలోచించే కేసీఆర్ మరోవైపు ఉన్నారని తెలిపారు. తెలంగాణ కోసం కష్టపడుతున్న కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావటం ఖాయమని స్పష్టంచేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, సంగారెడ్డి, ఎద్దుమైలారంలో మంత్రి హరీశ్రావు పర్యటించారు. సదాశివపేటలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మనబిన్ ఫౌండేషన్ అధ్యక్షుడు ముఖీమ్ తన మద్దతుదారులతో కలిసి మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సంగారెడ్డిలో మైనార్టీ నాయకులు పెద్దసంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. ఎద్దుమైలారంలో బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శివకుమార్ తన మద్దతుదారులతో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీపై ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే
కాషాయ పార్టీకి కాంగ్రెస్కు ఉన్న బంధం రాజగోపాల్ రాజీనామాతో బట్టబలైందని హరీశ్రావు అన్నారు. ‘కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి, వెంకట్రెడ్డి వేర్వేరు పార్టీల్లో ఉండి పరస్పరం మద్దతు ఇచ్చుకున్నా కాంగ్రెస్, బీజేపీ వారిపై చర్యలు తీసుకోలేదు. దుబ్బాక, హుజూర్నగర్, మునుగోడులో మూడు ఉప ఎన్నికలు జరిగితే ఎక్కడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కలేదు. కాంగ్రెస్ అంతర్గతంగా బీజేపీకి సహకరించటం వల్లే డిపాజిట్ రాలేదు. నాటి సహకారానికి కృతజ్ఞతగా బీజేపీ ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది. కిషన్రెడ్డి, రేవంత్రెడ్డి రోజూ రాత్రి మాట్లాడుకుని తమ పార్టీల ఎజెండాలను ఫిక్స్ చేసుకుంటున్నారు. రేపోమాపో కొంతమంది బీజేపీ నేతలను కిషన్రెడ్డి కాంగ్రెస్లోకి పంపే పనిలో ఉన్నారు. కాంగ్రెస్కు బీజేపీ బీ టీమ్గా మారింది. కేసీఆర్ను తట్టుకోలేక కాంగ్రెస్, బీజేపీ చీకట్లో చేతులు కలుపుతున్నాయి. కేసీఆర్ వ్యక్తి కాదు.. ఒక శక్తి. కేసీఆర్ను ఓడించటం ఎవరి తరమూ కాదు. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ ఒకవైపు ఉంటే, విషం నింపుకున్న నాయకులు కాంగ్రెస్, బీజేపీలో ఉన్నారు’ అని ధ్వజమెత్తారు.
సంగారెడ్డిలో బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయం
సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమని మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి ప్రజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన జగ్గారెడ్డి ఏనాడూ ప్రజలకు అందుబాటులో ఉండలేదని, కరోనా కష్టకాలంలో కూడా హైదరాబాద్కే పరిమితమయ్యారని విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలవకున్నా చింతా ప్రభాకర్ కరోనా సమయంలో జనం వెన్నంటి ఉన్నారని, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్, కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, డీసీసీబీ వైస్చైర్మన్ మాణిక్యం, బీఆర్ఎస్ నేతలు మామిళ్ల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
కర్ణాటక రైతుల గోస తెలంగాణ రైతులకు వద్దు
కర్ణాటకలో రైతులు కాంగ్రెస్ను నమ్మి గెలిపించి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని, కర్ణాటక రైతుల గోస తెలంగాణ రైతులకు రావద్దని మంత్రి హరీశ్రావు అన్నారు. కర్ణాటక రైతులు కొడంగల్, గద్వాలకు వచ్చి తమ కష్టాలు చెప్తున్నారని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ వల్ల వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా అవుతున్ననట్టు పేర్కొన్నారు. కరెంటు ఇవ్వని కాంగ్రెస్ను నమ్మవద్దని, రైతులకు అండగా ఉన్న కేసీఆర్ వెన్నంటే ప్రజలు, రైతులు ఉండాలని కోరారు. రైతుబంధు డబ్బులు వేయవద్దంటున్న కాంగ్రెస్ పార్టీకి రైతులు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం కుర్చీకోసం కొట్లాట జరుగుతుందని ఎద్దేవా చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, జానారెడ్డి.. ఇలా ఎవరికి వారే సీఎం అవుతానని చెప్తున్నారని, వారికి సీఎం కుర్చీ కొట్లాట తప్ప జనం గురించి పట్టదని విమర్శించారు.