జమ్మికుంట, సెప్టెంబర్ 30: ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నదని పేర్కొన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు తోడ్పాటు అందిస్తున్నదని వివరించారు. ఓసీల్లోని పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించామని అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని స్వాతిగార్డెన్లో నిర్వహించిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కుల, మతాలకు అతీతంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయా లు చేస్తున్నదని పేర్కొన్నారు. మతం ముసుగులో రాజకీయాలు చేసేవారివైపు ఉంటారా? అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నవారి వైపు ఉంటారో.. ఆలోచించుకోవాలని కోరారు. ఏడేండ్లలో ఒక్క డబుల్ బెడ్రూం కూడా కట్టించి ఇవ్వలేకపోయిన ఈటల రాజేందర్ మనకెందుకు? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ను గెలిపిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని అభయమిచ్చారు. ప్రతి మండలంలో ఆర్యవైశ్య కమ్యూనిటీ హాల్స్ నిర్మించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
హుజూరాబాద్ రూరల్: హూజూరాబాద్ మండలం సింగాపూర్ గెస్ట్హౌస్లో మంత్రి హరీశ్రావు సమక్షంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు టీఆర్ఎస్లో చేరారు. జమ్మికుంట, కమలాపూర్ మండలాల్లోని లక్ష్మీపురం, భీంపెల్లి, నర్సకపల్లికి చెందిన 50 మంది బీజేపీ కార్యకర్తలు, హుజూరాబాద్ మండలం రంగాపూర్లో బీజేపీకి చెందిన వంద మంది పద్మశాలీలు, బీజేపీ, కాంగ్రెస్లకు చెందిన 150 మంది ముదిరాజ్లు, జమ్మికుంట, ఇల్లందకుంట, బూజునూరు, కొత్తపల్లిలకు చెందిన 50 మంది బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వీరితోపాటు ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడు జీ సుధాకర్ నేతృత్వంలో కమలాపూర్ మండలం పూసల సంఘం నాయకులు టీఆర్ఎస్లో చేరారు.
హుజూరాబాద్ టౌన్: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుర్రం వెంకటేశ్వర్లు టీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన గుర్రం వెంకటేశ్వర్లుకు హుజూరాబాద్లోని ఆయన నివాసంలో మంత్రి హరీశ్రావు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ గులాబీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు పలువురు టీడీపీ నాయకులు కూడా టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు మంద రమేశ్, రాజన్న, పంజాల కుమారస్వామి, బత్తుల సమ్మయ్య, రమేశ్ పాల్గొన్నారు.