సిద్దిపేట, జూన్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీ గౌరవెల్లి ప్రాజెక్ట్టును అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. గౌరవెల్లి రిజర్వాయర్ సంఘటనపై బుధవారం సిద్దిపేట మార్కెట్ యార్డులో మంత్రి హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ.. హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి నీళ్లు రావొద్దని ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. నాడు మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ జలాశయం పనులను ఇలాగే అడ్డుకొన్నారని, ప్రజలను రెచ్చగొట్టి అధికారులపై తిరగపడేలా చేసి తప్పుకొన్నారని ఆరోపించారు.
సీఎం కేసీఆర్కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని ఆ పార్టీలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు. కొన్ని పార్టీలు 60 ఏండ్లు అధికారంలో ఉన్నా సాగు నీరు తేలేదని, ఈ వానకాలం లక్ష ఎకరాలకు సాగు నీరు ఇద్దామనుకొంటే వద్దంటాయా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ట్రాప్లో పడొద్దని గౌరవెల్లి నిర్వాసితులకు మంత్రి హితవు పలికారు. ఎన్నిసార్లు అయినా
చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. 2013 పునరావాస చట్టం ప్రకారం ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం సానుభూతితో ఆలోచిస్తున్నదని వెల్లడించారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి గోదావరి జలాలు రాకుండా చేయటమే కాంగ్రెస్, బీజేపీ లక్ష్యమని, గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే లక్ష కుటుంబాలు లాభపడతాయని చెప్పారు. ఆ పార్టీల దుర్మార్గాలను గ్రామగ్రామాన ఎండగడతామని మంత్రి హెచ్చరించారు.
3,816 ఎకరాల భూసేకరణ పూర్తయ్యిందని, కేవలం 84 ఎకరాల భూమి సేకరణ జరగలేదని, వాళ్లు కోర్టుకు వెళ్తే వారి పరిహారం కోర్టులో డిపాజిట్ చేస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. 97.82 శాతం భూసేకరణ జరిగిందని అన్నారు.రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా గౌరవెల్లి నిర్వాసితులకు ఎకరానికి రూ.15 లక్షల పరిహారం ఇస్తున్నామని, భూసేకరణలో భాగంగా ఇప్పటికే రూ.200 కోట్లు చెల్లించామని వివరించారు. నిర్వాసితుల పరిధిలో 693 ఇండ్లు ఉండగా, అందులో 2015లో 683 ఇండ్లకు రూ.83 కోట్లు చెల్లించామని స్పష్టం చేశారు. ఆర్అండ్ఆర్ కింద 937 కుటుంబాలను గుర్తించామని, ఇందులో 927 కుటుంబాలకు రూ.74.88 కోట్లు చెల్లించినట్టు వెల్లడించారు.
గౌరవెల్లి భూ నిర్వాసితులతో ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. బుధవారం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మెట్టుబండల వద్ద మంత్రి హరీశ్రావు సమక్షంలో భూనిర్వాసితులతో ప్రశాంత వాతావరణంలో చర్చలు జరిపారు.ఈ సందర్భంగా చర్చలకు వచ్చిన భూ నిర్వాసితులను మంత్రి సాదరంగా ఆహ్వానించారు. దాదాపు గంటసేపు నిర్వాసితుల డిమాండ్లను విన్న మంత్రి హరీశ్రావు.. సానుకూలంగా స్పందించి, తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రిజర్వాయర్ కోసం చైనా నుంచి మోటర్లు తెప్పించామని, మూడేండ్ల వరకు వాటికి వారంటీ ఉంటుందని, ఈ లోపు వెట్ రన్ నిర్వహించాలని, లేదంటే వారంటీ అయిపోయాక సమస్య వస్తే రాష్ట్ర ప్రభుత్వంపై కోట్ల భారం పడుతుందని వివరించారు. అందుకోసం సర్వే పనులు త్వరగా పూర్తి చేసేందుకు ఇంజినీర్లు, సిబ్బందిని గౌరవెల్లికి పంగా, కొందరు అక్కడకు పోయి వారిని అడ్డుకొనే ప్రయత్నం చేశారని, అందుకే పోలీసులు అక్కడకు వెళ్లారని అన్నారు. కుడికాల్వ 45 కిలోమీటర్లు, ఎడమ కాల్వ 11 కిలోమీటర్లు పూర్తయిందని తెలిపారు. కాల్వలు పారితే చెరువులు, బావులు, కుంటలు నిండి జనం బతుకుతారని చెప్పి,నిర్వాసితులను ఒప్పించారు.