Minister Harish rao | మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీష్రావు ఆరోపించారు. మోటర్లకు మీటర్లు పెడితే తప్పేంటన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.. ఇప్పుడు మునుగోడు ప్రజలకు ఏం చెప్తారని నిలదీశారు. మునుగోడు ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ నేతలు 200 కార్లు, 2000 మోటర్ సైకిళ్లు బుక్ చేశారని చెప్పారు. టీఆర్ఎస్ వద్ద తాంత్రిక విద్యలు లేవన్న ఆయన.. తమ వద్ద లోక్తాంత్రిక్ మాత్రమే ఉన్నదని స్పష్టం చేశారు. యూపీలో స్టార్ట్ చేసిన భూతవైద్యం కోర్సును బండి సంజయ్ నేర్చుకుంటే బాగుంటుందని ఎద్దేవాచేశారు. ఆదివారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ తెచ్చిపెట్టిందన్న మంత్రి హరీష్రావు.. అధికార దుర్వినియోగానికి పాల్పడి దొడ్డిదారిన గెలిచేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. నాయకులను డబ్బులు పెట్టి కొనడమే కాకుండా కార్లు మోటర్ సైకిళ్ళు గిఫ్ట్గా ఇస్తున్నారన్నారు. ఇప్పటికే మునుగోడులో పంచేందుకు 200 బ్రెజ్జా కార్లు, 2000 మోటర్ సైకిళ్ళు బుక్ చేసినట్లు తెలిసిందని ఆరోపించారు. మండలాలవారీగా ఓటర్లకు పంచుతున్న కార్లు, బైకుల లిస్టును ఎన్నికల కమిషన్కు ఇస్తామని చెప్పారు. ఇవ్వాళ కార్లు, మోటర్ సైకిళ్లు కొనిచ్చిన బీజేపీ నేతలు.. రేపు మోటర్లకు మీటర్లు పెడతారని హెచ్చరించారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడితే తప్పేంటని రాజగోపాల్ రెడ్డి గతంలో అన్నాడని, మునుగోడు ప్రజలు మోటర్లకు మీటర్లు కావాలో.. దేశాన్ని అభివృద్ధి చేయాలనే తపించే టీఆర్ఎస్ కావాలో తేల్చుకోవాలని హరీష్రావు సూచించారు.
ఇవ్వాళ మునుగోడు ఆత్మగౌరవ పరీక్ష అని చెప్పిన హరీష్రావు.. మునుగోడు ప్రజలు గెలవాలా? రాజగోపాల్ రెడ్డి ధనం గెలవాలా? అన్నది ముఖ్యమైందన్నారు. ఫ్లోరెడ్ సమస్యను తీర్చి, అన్ని వర్గాలకు పెన్షన్లు ఇస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం అని గుర్తుచేశారు. పేదింటి ఆడపిల్ల కల్యాణం కోసం లక్ష ఇస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పారు. రైతుబంధు, రైతుబీమాతో పాటు మరెన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. ఇటీవల కేంద్రం నుంచి అందుకున్న అవార్డులే తెలంగాణలో టీఆరెస్ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు.
దివాలాకోరు దిక్కుమాలిన ప్రభుత్వం బీజేపీ అని ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్రావు.. వంట గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచినం అని ఓటర్లకు చెప్పుకుంటారా? అని నిలదీశారు. ప్రభుత్వ రంగ సంస్థలను వరుసపెట్టి అమ్ముతున్న ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ అని దుయ్యబట్టారు. దేశ సైనికులను కూడా విడిచిపెట్టకుండా వారి ఉసురు తీసిన బీజేపీ ప్రభుత్వం.. చేనేత కార్మికులకు ఇచ్చిన పథకాలను తొలగించి వేసిందని ఆరోపించారు. దేశంలో ఒక్క వర్గం వారికైనా బీజేపీ మంచి పని చేసిందా? అని ప్రశ్నించారు.
మునుగోడు ప్రజలకు ఏం చేస్తామో చెప్పలేని బీజేపీ నేతలు.. క్షుద్రపూజలు అని ఒకరు, అవినీతి అని మరొకరు అంటున్నారని హరీష్రావు ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ దివాలాకోరు రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్ర తంత్రాలతో తామేమైనా అధికారంలోకి వచ్చామా? అని ప్రశ్నించారు. మతం పేరుతో అధికారంలోకి వచ్చేందుకు రాజకీయం చేసేది ఒక్క బీజేపీయే అన్నారు. అందుకే భూతవైద్యం కోర్సు నేర్చుకోవాలని యూపీలోని బీజేపీ ప్రభుత్వం కొత్త కోర్సును తీసుకొచ్చిందన్నారు. మంత్ర తంత్రాలు, మత కల్లోలాలు బీజేపీకి తెలిసినంత ఎవ్వరికీ తెలియవని చెప్పారు. బండి సంజయ్ యూపీకి వెళ్లి భూతవైద్యం కోర్సు నేర్చుకుంటే బెటర్ అని వ్యంగ్యంగా అన్నారు. బీజేపీకి దమ్ముంటే మునుగొడులో అభివృద్ధి గురించి మాట్లాడాలన్నారు. బీజేపీకి దమ్ముంటే చేసే ఆరోపణలపై ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ దగ్గర తాంత్రిక విద్యలు లేవని, లోక్తాంత్రిక్ మాత్రమే ఉన్నదన్నారు.