హైదరాబాద్ : రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం యథావిధిగా కొనసాగుతుందని ఆర్థిక మంత్రి హరీశ్రావు శాసనసభలో స్పష్టం చేశారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ, భట్టి విక్రమార్క, రఘునందన్ రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్రావు సమాధానం ఇచ్చారు.
ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన మూడు డీఏల్లో మొన్న ఒక డీఏ ఇచ్చామని తెలిపారు. మరో రెండు డీఏలపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. న్యూ ఉస్మానియా బిల్డింగ్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. యునాని హాస్పిటల్ను కూడా అభివృద్ధి చేస్తాం అని ప్రకటించారు. పన్నులు వేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఎలాంటి కొత్త పన్నులు వేయం. సొంత ఆదాయ వనరులపై దృష్టి సారించాం అని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ సమస్యలు లేకపోతే.. పవర్ హాలిడేలు, క్రాప్ హాలిడేలు ఎందుకు ప్రకటించారు. ఇందిరా పార్క్ వద్ద పారిశ్రామికవేత్తలు ఎందుకు ధర్నాలు చేయాల్సి వచ్చిందని హరీశ్రావు భట్టిని అడిగారు. హైదరాబాద్ నగరానికి కృష్ణా జలాలను తీసుకొస్తే.. ఇదే సభలో దివంగత ఎమ్మెల్యే పీజేఆర్ ఎందుకు నీళ్ల గురించి ప్రశ్నించిన విషయాన్ని హరీశ్రావు గుర్తు చేశారు.
రాష్ట్రానికి సంబంధించిన స్పోర్ట్స్ పాలసీ రెడీగా ఉంది. ఆ పాలసీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. క్రీడల విషయంలో ప్రభుత్వం క్రియాశీలకంగా పని చేస్తుందన్నారు. రెండు, మూడు నెలల క్రితం డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న మధ్యప్రదేశ్లో ఎరువులు దొరక్క తొక్కిసలాట జరిగి ఆరుగురు రైతులు మరణించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరత లేదు. అన్ని మండలాల్లో గోడౌన్లు కట్టి.. బఫర్ స్టాక్ ఉంచి రైతులకు ఎరువులు అందిస్తున్నాం. ప్రభుత్వం యొక్క ముందు చూపు, సీఎం కేసీఆర్ దార్శనికత వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు అని హరీశ్రావు స్పష్టం చేశారు.