హైదరాబాద్ గల్లీలో మిలియన్ మార్చ్ కాదు.. దమ్ముంటే బండి సంజయ్ ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టాలని మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. అప్పుడు దేశవ్యాపత్ంగా ఉన్న నిరుద్యోగులు తరలి వచ్చి పోరాటం చేస్తారని హితువు పలికారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణ పనులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీశ్ రావు.. బీజీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఉద్యోగాలు.. ఉద్యోగాలు అని బీజేపీ నేతలు దొంగ జపం చేస్తున్నారు. దొంగే దొంగ అంటున్నరు. అసలు ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు…? ఇవ్వంది ఎవరు..? నోటిఫికేషన్లు ఇచ్చింది ఎవరు.. నోటిఫికేషన్లు ఇవ్వనిది ఎవరు..? రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా.. దేశంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా….? బండి సంజయ్ అండ్ బ్యాచ్ దమ్ముంటే సమాధానం చెప్పాలి.. గాలి మాటలు కాదు..ఉద్యోగాలు ఇస్తే గణాంకాలు చెప్పాలి… మీ బీజేపీ హయాంలో దేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలి.
నోటికి వచ్చినట్లు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడి తప్పుడు ప్రచారం చేస్తే ఉద్యోగాలు ఇచ్చినట్లు అవుతుందా.. నోటిఫికేషన్లు ఇచ్చినట్లు అవుతుందా… బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం ఎంత పెరిగిందో.. నిరుద్యోగ యువత ఎంత బాధ పడుతుందో బండి సంజయ్ తెలుసుకోవాలి.
తెలంగాణ ఏర్పాటు తర్వాత నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. టీఎస్పీఎస్సీ, పోలీసు, సింగరేణి, గురుకులాలు, విద్యుత్, మెడికల్ హెల్త్ తదితర విభాగాల్లో మొత్తం 1,32,899 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. ఒక్క టీఎస్పీఎస్సీ ద్వారానే 30,594 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 31,972 పోస్టులు, జూనియర్ పంచాయతీ సెక్రెటరీలు 9,355, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 12,500, విద్యుత్ సంస్థల ద్వారా 6,648, డీసీసీబీలు 1571, టీఆర్టీ ద్వారా 8792, గురుకులాల్లో 11,500 టీచర్ పోస్టులను భర్తీ చేసింది.
మొత్తంగా ఇప్పటి వరకు 1,32,899 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. మరో 50 నుంచి 60వేల పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఉమ్మడి ఏపీలో అమల్లో ఉన్నప్పటి నాన్ లోకల్ విధానాన్ని రద్దు చేసి తెలంగాణ ప్రజలకే వంద శాతం ఉద్యోగాలు దక్కేలా చర్యలు చేపట్టింది. 95శాతం ఉద్యోగాలు స్థానికులకు లభించేలా కొత్త జోనల్ విధానాన్ని తీసుకువచ్చారు. దీనికి గాను 317 జీవోను విడుదల చేయడం జరిగింది. ఈ ప్రక్రియ పూర్తయితే దీని ప్రకారం, కొత్త ఖాళీలు గుర్తించి, నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికతో ఉంది.
అయితే దీన్ని అడ్డుకునేందుకు బీజేపీ అనేక కుట్రలు పన్నుతున్నది. తెలంగాణ స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కకుండా చేస్తున్నది. మీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రపతి ఉత్తర్వుల స్పిరిట్తో, రాష్ట్రపతి నిబంధనలకు లోబడి జీవో నెంబర్ 317 వచ్చింది. అలాంటి దానిపై బీజేపీ నేతలు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే.. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతిపై విమర్శలు చేయడమే.
తెలంగాణలో ఒక్క ఖాళీ లేకుండా ఉండాలని, అన్ని జిల్లాల యువత ఉద్యోగ అవకాశాలు లభించాలన్నదే సిఎం కేసీఆర్ ఆకాంక్ష. దీనిని అడ్డుకునేందుకే బీజేపీ చిన్న విషయాన్ని భూతద్దంలో చూపెట్టి ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య చిచ్చుపెట్టి, ఆ మంటలో చలి కాచుకుంటున్నది. బండి సంజయ్ నీ గోబెల్స్ ప్రచారాన్ని ఎవరు నమ్మరు. బిజేపీ నాయకులకు తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు.. నోటిఫికేషన్ల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది. బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నది. నిరుద్యోగ భారత్ గా చేస్తున్నది..ఈ విషయాన్ని ప్రముఖ విశ్లేషణ సంస్థలు వెల్లడిస్తున్నాయి.. అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.