కుటుంబ రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మోదీ.. గతంలో కుటుంబ పార్టీలతో బీజేపీ అంటకాగినప్పుడు ఎందుకు నోరు మెదపలేదు? తమిళనాడులో డీఎంకే, ఏపీలో టీడీపీ, మహారాష్ట్రలో శివసేన, పంజాబ్లో అకాలీదళ్తో పొత్తు పెట్టుకొన్నప్పుడు ఈ చిలుక పలుకులు ఏమయ్యాయి? శివసేనతో, అకాలీదళ్తో బీజేపీ అధికారం పంచుకోలేదా? యూపీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొన్న అప్నాదళ్ కుటుంబ పార్టీ కాదా?
నాడు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసిండ్రు.. నేడు బీజేపీ తెలంగాణలో చిచ్చు పెట్టి అభివృద్ధిని అడ్డుకొంటున్నది. ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాష్ర్టాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. ఓట్ల కోసం మత కలహాలు సృష్టించే పార్టీ బీజేపీ.
-మంత్రి హరీశ్రావు
సిద్దిపేట, మే 26 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిత్యం రెచ్చగొట్టే మాటలతో.. ఓట్ల కోసం మత కలహాలు సృష్టించే పార్టీ బీజేపీ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో చిచ్చుపెట్టి అభివృద్ధి ప్రక్రియను అడ్డుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీకి తమ రాష్ట్ర అధ్యక్షుడు ఏం మాట్లాడుతున్నారో కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. అవసరానికి మద్దతు ఇచ్చినప్పుడు మంచిగా కనిపించిన టీఆర్ఎస్.. ఇప్పుడు కుటుంబపార్టీగా ప్రధాని మోదీకి కనిపిస్తున్నదని హరీశ్రావు మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ మోదీ తెలంగాణకు వచ్చి ఏదో ఇస్తాడనుకొంటే.. రాజకీయ బురద చల్లి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.
తెలంగాణకు ఏం చేశారో చెప్పుకోలేక.. పనికిరాని పాత డైలాగులే మళ్లీ చెప్పి వెళ్లిపోయారని చురకలు వేశారు. ‘కుటుంబ రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మోదీ.. గతంలో కుటుంబ పార్టీలతో బీజేపీ అంటకాగినప్పుడు ఎందుకు నోరు మెదపలేదు? తమిళనాడులో డీఎంకే, ఏపీలో టీడీపీ, మహారాష్ట్రలో శివసేన, పంజాబ్లో అకాలీదళ్తో పొత్తు పెట్టుకొన్నప్పుడు ఈ చిలుకపలుకులు ఏమయ్యాయి? శివసేనతో, అకాలీదళ్తో బీజేపీ అధికారం పంచుకోలేదా? మొన్న యూపీ ఎన్నికల్లో బీజేపీ పొత్తు పెట్టుకొన్న అప్నాదళ్ కుటుంబపార్టీ కాదా?’ అని ప్రశ్నించారు. ‘ఇదే టీఆర్ఎస్ పార్టీని గతంలో ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్ దగ్గరకు స్వయంగా వచ్చి అడిగినప్పుడు టీఆర్ఎస్ మంచి పార్టీ. కుటుంబపార్టీ కాదు. ఇవాళ మాత్రం కుటుంబపార్టీగా కనపడుతున్నదా?’అని ప్రశ్నించారు.
బీజేపీలో ఉన్న నాయకుల వారసత్వ రాజకీయాలపై మంత్రి హరీశ్రావు సూటి ప్రశ్నలు
1. అమిత్షా కుమారుడు బీసీసీఐ కార్యదర్శి ఎట్టా అయితడు? ఆయనేమన్నా క్రికెటరా?
2. మీ కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్ కొడుకు పంకజ్సింగ్ యూపీ ఎమ్మెల్యేగా లేరా?
3. మిజోరాం గవర్నర్ ఎవరు?
4. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరారాజే కొడుకు దుష్యంత్సింగ్ ఎంపీగా లేరా?
5. పీయూష్గోయల్ ఎక్కడినుంచి వచ్చిండు? ఆయన తండ్రి బీజేపీ రాజకీయాల్లో లేరా!
6. యూపీ ఎన్నికల్లో మీరు పొత్తు పెట్టుకొన్న అప్నాదళ్ కుటుంబపార్టీ కాదా?
7. మీరు పొత్తు పెట్టుకొన్న శివసేన, అకాలీదళ్ కుటుంబ పార్టీలు కావా?
8. జమ్ముకశ్మీర్లో మీరు పొత్తు పెట్టుకొన్న మహబూబా ముఫ్తీ పార్టీ కుటుంబపార్టీ కాదా?
9. హర్యానాలో చౌతాలా మనుమడితో ఇవాళ మీరు అధికారం పంచుకోవడం లేదా?
తెలంగాణ ఒక కుటుంబం
ఇవాళ కేసీఆర్ది కుటుంబ పార్టీ కాదని.. తెలంగాణ రాష్ట్రమే ఒక కుటుంబమని మంత్రి హరీశ్రావు చెప్పారు. యావత్ రాష్ర్టాన్ని ఒక కుటుంబంగా భావిస్తూ ప్రజల కష్ట సుఖాలను తన కష్ట సుఖాలుగా భావించి, పరిపాలించే నేత కేసీఆర్ అని పేర్కొన్నారు. రైతులు, పేదలు, దళితులు.. ఇలా అన్ని వర్గాల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు కేసీఆర్ అని స్పష్టంచేశారు. అధికారం అనేది లాక్కుంటే వచ్చేది కాదని.. తాము దొడ్డిదారిన రాలేదని ప్రజలు ఇస్తే వచ్చామని చెప్పారు. దేశంలో పేద ప్రజల బాధలు పట్టని పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీజేపీయేనని తెలిపారు. పెద్ద పెద్ద కార్పొరేట్లకు రెడ్కార్పెట్ వేసే పార్టీ బీజేపీ కాగా, పేదలను అక్కున చేర్చుకుని సంక్షేమ పాలన అందిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్దని చెప్పారు. పేదలకు ఇచ్చే సబ్సిడీని ఎగబెట్టిన పార్టీ బీజేపీ అని మండిపడ్డారు.
తెలంగాణలో టీఆర్ఎస్దే అధికారం
రెండు ఉపఎన్నికల్లో గెలిచినంత మాత్రాన తెలంగాణలో అధికారం బీజేపీదేనని మోదీ చంకలు గుద్దుకుంటున్నారని మంత్రి హరీశ్రావు ఎద్దేవాచేశారు. ఉపఎన్నికల ఫలితాలే ప్రామాణికమైతే యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఉండేదే కాదన్నారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఖాళీ చేసిన ఎంపీ సీటులో ఎస్పీ గెలిచినప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ అధికారంలోకి వచ్చిందా? అని ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ గెలిచిన ఎంపీ సీటును తృణమూల్ గెలుచుకొన్న విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణలో ఇంటి పార్టీ టీఆర్ఎస్ మాత్రమే గెలుస్తుందని స్పష్టంచేశారు. ‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేది కల్ల. కేంద్రంలో బీజేపీ అధికారం పోవడం మాత్రం నూటికి నూరు పాళ్లు నిజం. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది? తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రని తెలంగాణ ఆత్మాభిమానాన్ని పార్లమెంట్లో దెబ్బతీసింది మోదీ కాదా?’ అని మంత్రి హరీశ్ అన్నారు. దేశ ఆర్థిక రంగాన్ని దివాళా తీయించిన మోదీ.. పేదలకు మేలుచేస్తున్న కేసీఆర్పై కక్ష గట్టి అప్పులపై కూడా ఆంక్షలు పెట్టారని మండిపడ్డారు. మాయమాటలు చెప్పినంత మాత్రాన బీజేపీకి అధికారం రాదని.. తెలంగాణలో అంత అమాయకులు లేరని మోదీ గ్రహిస్తే మంచిదని హితవు పలికారు.
మీరు చెప్తే నేర్చుకొనే స్థితిలో తెలంగాణ లేదు
మోదీ అన్నట్టు తెలంగాణ పౌరుషానికి ఆత్మాభిమానానికి మారు పేరని.. గుజరాత్ వాళ్లు చెప్తే నేర్చుకొనే స్థితిలో లేదని హరీశ్ స్పష్టంచేశారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా అక్కరకు రాని విషయాలు తెరపైకి తెచ్చే పార్టీ బీజేపీ అని ఎద్దేవాచేశారు. గురివిందలా మోదీ మాట్లాడితే అబద్ధాలు నిజాలు కావన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి గురించి గొప్పలు చెప్పుకొనే మోదీకి.. 50 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లోకి రైతుబంధు కింద డబ్బులు జమ చేయడం కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ‘టీమ్ ఇండియా అన్నావ్.. కానీ టీమ్ గుజరాత్తో పాలన చేస్తున్నావ్.. ఇది గుజరాత్ పరివార్వాద్ కిందకు రాదా? అదానీ, అంబానీలకు దోచిపెట్టడం ఏ టీమ్ ఇండియా స్పిరిట్?’ అని ప్రశ్నలు గుప్పించారు. ఇవ్వాళ తెలంగాణను టెక్నాలజీ హబ్గా మర్చింది టీఆర్ఎస్ పార్టీయేనన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన ఐటీ కంపెనీలు తెలంగాణకు వస్తున్నాయని.. ఇందులో కేంద్రం చేసిందేమీ లేదని స్పష్టంచేశారు. ‘టెక్నాలజీ హబ్గా మారుస్తా అని ఉత్త మాటలు చెప్పి పోవడం కాదు.. దమ్ముంటే హైదరాబాద్కు ఐటీఐఆర్ కేటాయించు. 2013లో హైదరాబాద్ మీటింగ్ నా రాజకీయ జీవితంలో టర్నింగ్ పాయింట్ అన్నావ్. ఆ సెంటిమెంట్ను నమ్ముకుంటే తెలంగాణకు ఏం చేశావ్? నయా పైసా ఇచ్చావా? కొత్త ప్రాజెక్టు ఇచ్చావా? కనీసం విభజన చట్టం హామీలైనా అమలు చేశావా?’ అని మంత్రి హరీశ్ మోదీని నిలదీశారు.
మోదీ అమ్మకానికి మరోపేరు
కేసీఆర్ నమ్మకానికి మారుపేరు.. మోదీ అమ్మకానికి మరోపేరని మంత్రి హరీశ్రావు అన్నారు. కేంద్రంలో సగం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. మూఢనమ్మకాలను కేసీఆర్ నమ్ముతాడన్న మోదీ మాటలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. నమ్మకానికి, అమ్మకానికి తేడా తెలియని మోదీకి మూఢ నమ్మకానికి, ధర్మానికి తేడా తెలుస్తుందనుకోవడం మూర్ఖత్వమేనని చెప్పారు. ‘కేసీఆర్ ధర్మ రక్షకుడు, ప్రతి ధర్మాన్ని నమ్ముతాడు. ఆచరిస్తాడు. ఓట్ల కోసం కాదు.. హిందుత్వమనేది మా జీవన విధానం. మీరు హిందుత్వాన్ని ఓట్లకోసం, రాజకీయాల కోసం వాడుకొని రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తారు’ అని మంత్రి హరీశ్ స్పష్టంచేశారు. ఇవాళ సిల్వర్జూబ్లీకి వచ్చిన మోదీ చిల్లర రాజకీయాలు మాట్లాడిపోయారన్నారు.
ఇవి ప్రధాని స్థాయికి తగినవి కావని చెప్పారు. తెలంగాణను విచ్ఛిన్నం చేసేవాళ్లున్నారని మోదీ అన్న మాటలను ప్రస్తావిస్తూ.. నాడూ ఉన్నారు.. నేడూ ఉన్నారని పేర్కొన్నారు. ‘తెలంగాణ రాకుండా కాంగ్రెస్లో కొందరు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేశారు. మీ బీజేపీ ఒక ఓటు.. రెండు రాష్ర్టాలు అని చెప్పి, అధికారంలోకి వచ్చాక మోసం చేసింది. నాడు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసిండ్రు. నేడు తెలంగాణలో చిచ్చుపెట్టి అభివృద్ధిని అడ్డుకొంటున్నరు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాష్ర్టాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నరు. ఓట్ల కోసం మత కలహాలు సృష్టించే పార్టీ బీజేపీ. మీ సంజయ్ మాట్లాడిన మాటల్లో చూడండి.. రెచ్చగొట్టే మాటలు తప్ప మరొకటి లేదు’ అని మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
టీమ్ ఇండియా అన్నావ్.. కానీ టీమ్ గుజరాత్తో పాలన చేస్తున్నావ్.. ఇది గుజరాత్ పరివార్ వాద్ కిందకు రాదా అదానీ, అంబానీలకు దోచిపెట్టడం ఏ టీమ్ ఇండియా స్పిరిట్?
అడుగడునా అన్యాయమే
ఇతర రాష్ర్టాలకు కావాల్సినన్ని నిధులు ఇస్తూ తెలంగాణకు తీరని నష్టం చేస్తున్నారని హరీశ్ అన్నారు. బీఆర్జీఎఫ్ రూ.1500 కోట్లు మూడేండ్ల నుంచి ఇవ్వటంలేదని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో సీఎస్ఆర్ డబ్బులు రూ.500 కోట్లు ఆంధ్రకు పోయినవి తిరిగి ఇప్పించాలని కోరితే ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు.15వ ఆర్థిక సంఘం నిధులు రూ.6 వేల కోట్లు రానేలేదని చెప్పారు. ఆర్థిక సంఘం రిపోర్టును తుంగలో తొక్కి అన్యాయం చేసిన తొలి కేంద్ర ప్రభుత్వం బీజేపీదే అని అన్నారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు పాల్గొన్నారు.
ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి
తెలంగాణకు మోదీ సర్కారు అన్యాయం చేసిందని హరీశ్ తీవ్రంగా మండిపడ్డారు. న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బులు కూడా ఇస్తలేరని అన్నారు. రాష్ర్టానికి హామీ ఇచ్చిన వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. కేంద్రం హామీలపై హరీశ్రావు మోదీని సూటిగా ప్రశ్నించారు.