CM KCR | కేసీఆర్కు ముందు తండాల పరిస్థితి ఏందీ..? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేయాలని మంత్రి హరీశ్రావు గిరిజనులకు సూచించారు. మేడ్చల్ జిల్లా శామిర్పేటలో గిరిజనుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎంపీ సీతారాం నాయక్, పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి సమ్మేళనానికి వచ్చిన గిరిజన ప్రజాప్రతినిధులకు పేరు పేరున అభినందనలు తెలిపారు. కేసీఆర్కు ముందు.. కేసీఆర్కు తర్వాత అని ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచన చేయాలన్నారు. ఆనాడు తాగునీళ్ల కోసం ఎంత కష్టపడ్డారో చూడాలన్నారు. నారాయణ ఖేడ్లో బిందెలతో ఎన్నో పోరాటాలను జరిగిన గుర్తు చేశారు. ఆనాడు తండాలు మంచం ఎక్కాయని.. విష జ్వరాలతో గిరిజన గూడాలని పేపర్లలో హెడ్డింగులు వచ్చేవని గుర్తు చేశారు.
ఇవాళ తాగునీటి కష్టాలు లేవని, మిషన్ భగీరథ కార్యక్రమంతో ప్రతి ఇంటికి మంచి నీళ్లు ఇస్తున్నామన్నారు. 2009లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని పెట్టిందని.. మరి చేసిందా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అన్ని తాండలను గ్రామ పంచాయతీలు చేశారన్నారు. ఆనాడు తండాలను గ్రామ పంచాయతీలు చేయాలని ఎన్నో పోరాటాలు.. ఎన్నో ఉద్యమాలు జరిగాయన్నారు. తాను కూడా తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలని పోరాటంలో పాల్గొన్నట్లు తెలిపారు. 4.50లక్షల ఎకరాల పొడు భూములకు సీఎం కేసీఆర్ పట్టాలు ఇచ్చారని.. ఆ భూములకు రైతుబంధు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. ప్రతి గిరిజన బిడ్డ చదువుకోవాలని గిరిజన గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని, విదేశీ విద్య పథకం పెట్టి ఎందరికో విదేశీ విద్యను అందించిందన్నారు.
గిరిజన బిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నారు. బంజారాహిల్స్లో గిరిజన ఆదివాసీ బిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలని బంజారా, ఆదివాసీ భవనాలను కట్టించారన్నారు. విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. రిజర్వేషన్లతో ఎంతో మంది గిరిజన బిడ్డలు డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యారన్నారు. గిరిజన గూడేలకు, తండాలకు త్రీ ఫేజ్ కరెంట్ ఏర్పాటు చేశారన్నారు. మళ్లీ కేసీఆర్ వస్తే గిరిజనబంధు ఇస్తారన్నారు. గ్రామ పంచాయతీలు కొత్తవి కట్టుకుంటున్నామని, అలాగే తండాల్లో బంజారా భవనాలు కట్టుకుందామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనలకు ఎంతో మేలు చేశారని, పెట్టుబడులు లేక అప్పులు ఆనాడు చేశారని.. కానీ ఇప్పుడు కేసీఆర్ ఇస్తున్న రైతుబంధు గిరిజనులకు వరంగా మారిందని మంత్రి తెలిపారు. కొంతమంది ప్రతిపక్ష పార్టీల నాయకులు రైతుబంధు దండగ, దుబారా అంటున్నారన్నారు.
ఎన్నికల్లో గెలువగానే ప్రతి రేషన్కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తామని, గ్యాస్ సిలిండర్ రూ.400 ఇస్తామన్నారు. మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ ఒక్కవైపు ఉంటే.. మాట తప్పని కేసీఆర్ ఒకవైపు ఉన్నారన్నారు. మీరంతా సేవాలాల్, కొమరం భీం వారసులని.. అందరూ సరైన ఆలోచన చేయాలన్నారు.
అన్నం తిన్న రేవు మరవొద్దని.. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ కల్యాణ లక్ష్మి, రైతుబంధు బంధు ఇవ్వలేదని.. అలాంటప్పుడు ఎందుకు కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఆనాడు ప్రభుత్వ హాస్పిటల్స్ ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉన్నాయన్నారు. పని తనం తప్ప పగ తనం తెల్వదని.. 24 గంటలు ప్రజల కోసం ఆలోచన చేసే వ్యక్తి మన ముఖ్యమంత్రన్నారు.
టికెట్లు ఇవ్వాలి అంటే కర్ణాటక వాళ్లు.. ఓటర్లకు డబ్బులు ఇవ్వాలి అంటే కర్ణాటక కాంగ్రెస్ వాళ్లు.. ప్రచారం కోసం కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వస్తున్నారన్నారు. తెలంగాణకు కృష్ణా నదిలో నీళ్ల పంచాయతీ ఉన్నది.. మరి అలాంటప్పుడు కర్ణాటకతో కాంగ్రెస్ వాళ్లు కొట్లాడుతారా..? అని ప్రశ్నించారు.
బ్రిజేష్ ట్రిబ్యునల్ పంచాయతీ ఇంకా ఉందని.. ఐటీ కంపెనీలు ఎన్నో ఇక్కడ ఉన్నాయని.. ఇక్కడ ఉన్న అంతర్జాతీయ కంపెనీలు కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తారన్నారు. రైతు రుణమాఫీ ఇచ్చామని.. మిగతా రూ.4వేలకోట్లు సైతం ఈసీ అనుమతి ఇస్తే పూర్తిగా రుణమాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేయకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని.. వచ్చే నెల 3వ తేదీ తర్వాత రుణమాఫీ చేసుకుందామన్నారు.