సిద్దిపేట : కొమురవెల్లి మల్లన్న కల్యాణ వేడుకలు శోభాయమానంగా జరిగాయి. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను మల్లికార్జునుడు పెళ్లాడారు. మల్లికార్జునుడి కల్యాణానికి ప్రభుత్వ తరపున రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కల్యాణ వేడుకలో మంత్రి శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, రాష్ట్ర వైద్య సేవలు, మౌళిక సదుపాయ అభివృద్ది సంస్థ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్, ఈవో బాలాజీ, బార్శీ బృహన్మఠాధీశులు సిద్ధగురు మణికంఠ శివాచార్యులతో పాటు భారీగా భక్తులు పాల్గొన్నారు.
మల్లన్న కల్యాణ వేడుకల్లో భాగంగా ఇవాళ సాయంత్రం 7 గంటలకు కొమురవెల్లి మల్లన్న రథోత్సవం, రేపు ఉదయం 9 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు లక్షబిల్వార్చన, మహా మంగళహారతి నిర్వహించనున్నారు.
కొమురవెల్లి మల్లన్న కల్యాణ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున దిష్టి కుంభం కార్యక్రమం ఘనంగా జరిగింది. వీరశైవ ఆగమ విధానంలో 200 కిలోల బియ్యాన్ని అన్నము వండి ఆలయ మహా మండపంలో రాశిగా పోసి దిష్టి కుంభం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు పూర్తి చేశారు.