గజ్వేల్, నవంబర్ 20: విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో విద్యపై 10 శాతం ఖర్చుచేస్తున్నామని చెప్పారు. విద్యపై 5 శాతమే ఖర్చుచేస్తున్నారన్నది పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి హరీశ్రావు హాజరై ప్రసంగించారు. పీఆర్టీయూ గౌరవాన్ని పెంచే విధంగా ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ న్యాయం చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఉపాధ్యాయ, ఉద్యోగులకు సముచిత గౌరవం దక్కుతున్నదని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని పేర్కొన్నారు. సమాజంలో అబద్ధాలను వ్యాపింపచేసే వాళ్ల సంఖ్య పెరిగిపోతున్నదని, ప్రజలకు నిజాలు తెలియాలంటే అర్ధవంతమైన చర్చ జరగాలని అన్నారు. తెలంగాణ ప్రతి రంగంలో సాధించిన అభివృద్ధి దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు మంచి చెడులను విశ్లేషించి ఈ అభివృద్ధిని అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్పై ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, త్వరలో టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు.
వైద్యవిద్యకు పెద్దపీట వేశాం
తెలంగాణలో విద్యను పటించుకోవట్లేదని కొంతమంది అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. వైద్య ఆరోగ్యశాఖలోనూ వైద్య, విద్య కోర్సులు ఉంటాయని తెలిపారు. డాక్టర్లు, నర్సులు, బీ ఫార్మసీ, ఎంఫార్మసీ, దంత వైద్య ఇట్లా అనేక కోర్సుల్లో విద్యను అందరికీ అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎంబీబీఎస్ సీట్లు 850 మాత్రమే ఉంటే.. ఇప్పుడు 2,950కి పెంచామని వెల్లడించారు. ఇదంతా సీఎం కేసీఆర్ ఆలోచన, ముందుచూపుతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు మూడు మెడికల్ కాలేజీలుంటే.. ఇప్పుడు జిల్లాకు ఒకటి ఏర్పాటుచేస్తున్నామని గుర్తుచేశారు. ఇప్పటికే 12 కొత్త మెడికల్ కాలేజ్లు ప్రారంభించడంతో రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య 17కు చేరిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఒక్క సంవత్సరమే 8 మెడికల్ కాలేజ్లు ప్రారంభించామని, వచ్చే ఏడాది మరో 9 కాలేజ్లు ప్రారంభించబోతున్నామని వివరించారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 295 రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రమే ఉంటే, నేడు 920కి పెంచామని వెల్లడించారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో 2014లో 1.12 లక్షల మంది విద్యార్థులుంటే, ఇప్పుడు 4.46 లక్షల మంది ఉన్నారని తెలిపారు. 2014లో విద్యపై రూ.9,518 కోట్లు ఖర్చు చేస్తే, ఈ ఏడాది రూ.25,250 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. విద్యపై బడ్జెట్లో 10 శాతం ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వెల్లడించారు. ‘మనఊరు-మనబడి’ ద్వారా అన్ని పాఠశాలల్లో వసతులు పెంచి నాణ్యమైన విద్య అందించటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
దేశ జీడీపీ కంటే మనదే ఎక్కువ
తెలంగాణ తలసరి ఆదాయం 2014లో రూ.1,24,000 కాగా, ఈ సంవత్సరం రూ. 2,75,000కు పెరిగిందని మంత్రి హరీశ్రావు తెలిపారు. దేశ తలసరి ఆదాయం ఇప్పటికీ మనకంటే రూ.1.5 లక్షలు తక్కువగా ఉందని, ఇది ఆర్బీఐ వెల్లడించిన నిజమేనని పేర్కొన్నారు. 2014 నాటికి తెలంగాణలో సాగు విస్తీర్ణం 1.34 కోట్ల ఎకరాలుంటే, నేడు 2.30 కోట్ల ఎకరాలకు చేరిందని తెలిపారు. ఇది కాకుండా 11.50 లక్షల ఎకరాలకు ఉద్యానపంటల సాగు పెరిగిందని అన్నారు. 2014-15లో ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు ఉంటే, 2021-22 సంవత్సరానికి 2.49 కోట్ల టన్నులకు చేరిందని వెల్లడించారు. అన్ని పంటల ఉత్పత్తి కలిపి 3.50 కోట్లకు చేరుకొన్నదని తెలిపారు. తెలంగాణలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టలేదన్న కక్షతో కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రూ.6 వేల కోట్లు, ఎఫ్ఆర్బీఎం కింద రూ.15 వేల కోట్లు ఆపిందని విమర్శించారు. మొత్తం 21 వేల కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉన్నదని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ, మాజీ ఎమ్మెల్సీ పూలరవీందర్, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి, పీఆర్టీయూ నేతలు కమలాకర్రావు తదితరులు పాల్గొన్నారు.