Minister Harish Rao | హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ)/దుండిగల్: పొరపాటు కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణపై కర్ణాటక పెత్తనం చెలాయిస్తుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కర్ణాటక నేతలకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే టికెట్లు కావాలంటే ఢిల్లీ, డబ్బులు కావాలంటే కర్ణాటక అన్నట్టుగా రాష్ట్ర కాంగ్రెస్ నేతల పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు. ఇది రాష్ర్టానికి ప్రమాదకరమని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్ బాచుపల్లిలోని కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించిన ఆపిల్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో 5 గంటల కరెంటు ఇవ్వలేని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. కర్ణాటకలో నీళ్లు, కరెంటు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, తమ రాష్ర్టాన్ని చక్కదిద్దుకోలేని నేతలు తెలంగాణకు వచ్చి నీతులు చెప్తున్నారని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కర్ణాటక, ఢిల్లీ రిమోట్ కంట్రోల్ మీద ఆధారపడి పనిచేస్తున్నారని, సొంతంగా ప్రచారం చేసుకునే సత్తా కూడా లేదని దుయ్యబట్టారు. ‘కృష్ణాజలాలు, ఐటీ వివాదాలు తలెత్తితే మన హక్కులను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కాపాడుతారా? కర్ణాటకను ధిక్కరించే దమ్ము, ధైర్యం ఉన్నదా? కాళ్లు మొక్కేవాళ్లు, అడుగులకు మడుగులు ఒత్తేవాళ్లు తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతారా?’ అని ప్రశ్నించారు. తెలంగాణ రక్షణ ఒక్క కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజలు మరోసారి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్రం, నీతి ఆయోగ్ ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును కేంద్రం, నీతి ఆయోగ్ పలుమార్లు ప్రశంసించాయని హరీశ్రావు గుర్తుచేశారు. ‘దేశంలో 24 గంటల నిరంతర కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఒకప్పుడు కైకిలి దొరకడంలేదు అనేవాళ్లు. కానిప్పుడు కైకిలోళ్లు దొరకని పరిస్థితి నెలకొన్నది. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ను దాటి తెలంగాణ నంబర్ వన్గా ఎదిగింది. ఐటీ ఎగుమతుల్లో బెంగళూరును మించిపోయింది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఫేస్బుక్ వంటి సంస్థలు హైదరాబాద్లో ఉండటం మనందరికీ గర్వకారణం. గ్రీన్కవర్ 7.7% పెరిగింది. సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలవల్లే ఇది సాధ్యమైంది’ అని వివరించారు. వైద్యవిద్యలో ఇంజినీరింగ్లో ఎక్కువగా మహిళలే ప్రవేశాలు పొందుతున్నారని, క్యాంపస్ ప్లేస్మెంట్స్లోను మహిళలు సత్తాచాటుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో 2014లో 2,850 ఎంబీబీఎస్ సీట్లుంటే ఇప్పుడు 10 వేలకు చేరాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించడంతో వైద్యం సామాన్యులకు చేరువ అవుతున్నదని తెలిపారు.
అభివృద్ధికే ఓటేయాలి
యువత అభివృద్ధిని నమ్మాలని, రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉండాలో ఆలోచించి ఓటు వేయాలని హరీశ్రావు పిలుపునిచ్చారు. యువ ఓటర్లు వాస్తవాలను గ్రహించాలని, సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. సినీస్టార్ రజినీకాంత్కు తెలంగాణ అభివృద్ధి అర్థమైంది కానీ, ఇక్కడి గజినీలకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ డబుల్ ఇంజిన్ రాష్ర్టాల్లో అభివృద్ధి లేదని, ఆరోగ్యసూచీలో ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో ఉన్నదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఓట్ల కోసం కాకుండా, భవిష్యత్ బతుకులను ఆలోచించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, భవిష్యత్ బాగుకోరే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు.