హైదరాబాద్ : మరోసారి మంత్రి హరీశ్రావు తన మంచి మనసును చాటుకున్నారు. ఈటీవీ వీడియో జర్నలిస్టుగా పని చేస్తూ అనారోగ్యం బారిన పడ్డ పి.వెంకటేశ్వర్లకు వైద్య, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అండగా నిలిచారు. వెంకటేశ్వర్లకు లంగ్, బ్రెయిన్ క్యాన్సర్కు అవసరమైన చికిత్స ఉచితంగా అందించాలని, అందుకు చొరవ చూపాలని తెలంగాణ వీడియో జర్నలిస్ట్ సంఘం నాయకులు మంత్రికి విన్నవించారు.
సోమవారం కోకాపేటలోని మంత్రి నివాసంలో బాధితుడితో కలిసి అనారోగ్య పరిస్థితిని వివరించారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు తక్షణం స్పందించారు. వెంకటేశ్వర్లకు అవసరమైన సహాయం చేయాలని, మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బసవతారకం క్యాన్సర్ దవాఖానలో ఉచిత వైద్యం అందేలా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నారు. మంత్రి తక్షణం స్పందించి సహాయం చేయడం పట్ల వీడియో జర్నలిస్ట్ సంఘం సంతోషం వ్యక్తం చేసింది.