భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలి
అన్ని స్థాయిల్లోని వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి
వైద్యారోగ్య శాఖ అధికారులకు మంత్రి హరీశ్రావు ఆదేశం
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు కొనసాగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. వర్షాకాలపు ఆరోగ్య సమస్యల నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని చెప్పారు. సోమవారం అన్ని జిల్లాల వైద్యాధికారులు, దవాఖానల సూపరింటెండెంట్లు, విభాగాధిపతులు, వైద్యులతో మంత్రి హరీశ్రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లోని పరిస్థితుల గురించి ఆరా తీశారు. ముందస్తు జాగ్రత్తల గురించి సూచనలు ఇచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నారని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారని పేర్కొన్నారు. వైద్యారోగ్య శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నదని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా, డయేరియా తదితర రోగాల పట్ల ప్రజలకు అవగాహన పెంచాలని సూచించారు.
ఇందుకు ప్రజాప్రతినిధుల సహాయం తీసుకోవాలని చెప్పారు. అన్ని స్థాయిల్లో వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, పంచాయతీ రాజ్, మున్సిపల్, తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు వైద్యసేవలు అందించాలని అన్నారు. 108 వాహనాలు వెళ్లలేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాగులు పొంగటం, వరదలతో రోడ్లు చెడి పోవడం వల్ల కొన్ని గిరిజన ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీ తెగిపోయే అవకాశం ఉన్నదని, అలాంటి చోట్ల రోగులు, గర్భిణుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
బ్రాండెడ్ మందులు రాయొద్దు
అనంతరం మంత్రి హరీశ్రావు డీఎంఈ పరిధిలోని దవాఖానల పనితీరుపై నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హౌస్ సర్జన్లు, జూనియర్ డాక్టర్స్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు సహా డైట్, పారిశుద్ధ్య విభాగాల్లో పనిచేసే వారికి వేతనాలు సకాలంలో అందే విధంగా బిల్స్ త్వరిత గతిన సమర్పించాలన్నారు. అన్ని విభాగాల్లో ఆరోగ్యశ్రీ సేవలు మరింత ఎకువగా అందించాలని చెప్పారు. ఒక ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ థియేటర్ వినియోగం పెంచాలని చెప్పారు. రోగులకు త్వరిత గతిన సేవలు అందిస్తున్న వరంగల్ ఎంజీఎం, నిజామాబాద్, ఉస్మానియా దవాఖానల సిబ్బందిని అభినందించారు. జిల్లా స్థాయిలోనే నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో కేసులను అనవసరంగా హైదరాబాద్కు రిఫర్ చేయవద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా అందించే మందుల సంఖ్యను ప్రభుత్వం 720 నుంచి 843కు పెంచిందని చెప్పారు. కొత్తగా 123 రకాల మందులు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ఈ జాబితాలోని మందుల వివరాలు తెలిసేలా ప్రతి డాక్టర్కు బుక్లెట్ ఇవ్వనున్నట్టు తెలిపారు. దీని ప్రకారం జనరిక్ మెడిసిన్ సూచించాలని, బ్రాండెడ్ మందులు రాయొద్దని స్పష్టం చేశారు. వారానికి ఒకసారి విభాగాల వారీగా సూపరింటెండెంట్లు సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.