హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు బ్యాంకులు చేస్తున్న పొరపాట్లను గుర్తించి, మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.217 కోట్లు వెనక్కి ఇచ్చేలా చేశారు. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షలకు పైగా మహిళా సంఘాలకు లబ్ధి చేకూరింది.
మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ నిర్ణయించిన వడ్డీని మాత్రమే వసూలు చేయాలి. రూ.3 లక్షల వరకు రుణంపై 7 శాతం, రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణంపై 10 శాతం గరిష్ఠంగా లేదా ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్).. ఎది తక్కువైతే దాన్ని వసూలు చేయాలని 2022 జూలై 20న ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే కొన్ని బ్యాంకులు ఎక్కువ వడ్డీని వసూలు చేస్తున్నాయని, ఒకే బ్యాంకు పరిధిలోని ఒక్కో బ్రాంచీలో ఒక్కోలా వడ్డీ వసూలు చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గుర్తించారు. దీనివల్ల మహిళా సంఘాలు నష్టపోతున్నాయని.. 2022 డిసెంబర్ 23న జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ప్రస్తావించారు.
బ్యాంకులు అధికంగా వడ్డీని వసూలు చేస్తే వెంటనే సమీక్షించి తిరిగి ఆ మొత్తాన్ని సంఘాల ఖాతాల్లో తిరిగి జమ చేయాలని ఆదేశించారు. దీంతో.. 2,03,535 సంఘాల నుంచి రూ.217.61 కోట్ల వడ్డీని అధికంగా వసూలు చేసినట్టు బ్యాంకులు గుర్తించి, ఆయా సంఘాల అకౌంట్లలో అధిక వడ్డీని జమ చేశారు. మంగళవారం మంత్రి హరీశ్ దీనిపై మరోసారి సమీక్షించనున్నారు. మంత్రి హరీశ్ చర్యల వల్ల తమకు లబ్ధి చేకూరిందని సంతోషం వ్యక్తం చేసిన మహిళా సంఘాలు.. ఆయనకు ధన్యవాదాలు తెలిపాయి.