సిద్దిపేట, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఏపీ మంత్రులు చేతనైతే విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలని, పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని, రాష్ర్టానికి ప్రత్యేక హోదా కోసం కొట్లాడాలని ఆర్థిక మంత్రి హరీశ్రావు హితవుపలికారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్ చెప్పిందే చేసిండు.. చెప్పిందల్లా చేసే ప్రయత్నం చేసిండు అని పేర్కొన్నారు. ‘గీ ముచ్చటనే ఈ మధ్య ఏపీ రాష్ట్రం మేస్త్రీ కలిస్తే వాళ్లతో మాట మీదికేలి మాట మాట్లాడుతూ.. ఓ మాట అన్న. తెలంగాణ రాష్ట్రంలో మంచిగా కరెంట్ వస్తున్నది.. నీళ్లు మంచిగ వస్తున్నాయి. ప్రాజెక్టులు కట్టినం.
పెన్షన్లు ఇస్తున్నాం. కల్యాణలక్ష్మి పథకం.. ఇవన్నీ బాగున్నాయి. ఇక్కడే ఉండండని వారితో అన్నా’ అనిగుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను అన్నదేమీ లేదని.. మనం చేసుకున్న పనులను వారితో చెప్పానని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక అభివృద్ధిని లెక్కలతో వివరించానని, ఇక్కడే ఉండండని వారితో అన్నట్టు వివరించారు. దీనిపై కొంత మంది ఏపీ మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారని, ఉన్నది అంటే ఉలుకెందుకని ప్రశ్నించారు. ‘ఆనాడు రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా కోసం పోరాడుతానన్నారు.. ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ప్రత్యేక హోదా కోసం ఎందుకు మీ నాయకత్వం పనిచేస్తలేదు? విశాఖ ఉక్కు కోసం మీరెందుకు పోరాడుతలేరు? పోలవరం పనులు ఎందుకైత లేవు?’ ఇది అడిగా.. ఇందులో ఏమైనా తప్పుందా?అని ఏపీ మంత్రులను నిలదీశారు. ఏపీ ప్రజల పక్షాన మాట్లాడానే తప్ప, అక్కడి ప్రజలను ఒక్కమాట కూడా అనలేదని స్పష్టంచేశారు.
ఏపీ మంత్రుల విజ్ఞతకే వదిలేస్తున్నా
మీకు చేతనైతే విశాఖ ఉక్కు కోసం పోరాటం చేయండి.. పోలవరం ప్రాజెక్టును తొందరగా పూర్తిచేసి.. మా కాళేశ్వరం ప్రాజెక్టులాగా అక్కడి రైతులకు నీరందించండి అని హరీశ్ సూచించారు. ‘మీ గురించి చెప్పే ప్రయత్నంలో కాదు.. నా రాష్ట్ర ప్రజలకు చేసిన పనులు చెప్పా, మీ రాష్ట్ర ప్రజలు ఇక్కడ సెటిల్ అయితే చల్లగా ఉండండి, బాగుండండి, తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు రాల్చిన ప్రతి ఒక్కరూ మా బిడ్డలే అని వివరించా’ అని గుర్తుచేశారు. తాను అడిగిన దానికి సమాధానం చెప్పలేక, తానేదో ఏపీ ప్రజలను కించపరిచినట్టు కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని ఏపీ నేతలు, మంత్రుల తీరును ఎండగట్టారు. తన మాటలను వక్రీకరిస్తున్నా ఏపీ మంత్రుల విజ్ఞతకే వదిలేస్తున్నట్టు చెప్పారు. కచ్చితంగా మా తెలంగాణ రాష్ట్రం ఎంత గొప్పగా ఉన్నదని చెప్పడానికి ఇతర రాష్ర్టాలతో పోల్చితే తప్పేమున్నదని నిలదీశారు. నేడు ఏపీలో 8 గంటల కరెంట్ వస్తున్నది.. కర్ణాటకలో 7 గంటలు వస్తున్నది. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని నొక్కి చెప్పారు. ఇది మా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వ గొప్పతనమని గర్వంగా చెప్పుకుంటున్నామని పేర్కొన్నారు.
చెప్పకపోతే తప్పయితది కానీ, చెప్పితే తప్పు ఎట్లా అయితదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు తెలంగాణకు వచి పిచ్చి కూతలు కూస్తే దానికి సమాధానం చెప్పాలి కదా.. మీ పాలనలోని రాష్ర్టాల్లో ఎలా ఉందో మీకు తెలియదా అని చురకలంటించారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు, అభివృద్ధి తెలంగాణలో జరుగుతున్నదని, కేసీఆర్ అందిస్తున్న సుపరిపాలన గురించి వివరించినట్టు చెప్పారు. సమ్మేళనంలో బీఆర్ఎస్ జిల్లా సమన్వయకర్త బోడకుంటి వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, రైతుబందు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మన అభివృద్ధి తెరిచిన పుస్తకం
ఎన్నికలు దగ్గరకు వచ్చాయని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మనపై నీలాప నిందలు వేస్తున్నారని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. ఢిల్లీలో ఉన్న వారికి హైదరాబాద్లో ఉన్న వారికి మనం ఏం చేస్తున్నామో అర్థం కాదని, గ్రామాలకు వచ్చి చూస్తే అర్థమవుతుందని చురకలంటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు దండుగ అని మాట్లాడేవారు, 56 లక్షల ఎకరాల్లో వరి పంట ఎలా పండుతున్నదో సమాధానం చెప్పాలని నిలదీశారు. మన అభివృద్ధి తెరిచిన పుస్తకం లాంటిదని, గ్రామాల్లో ఎక్కడికక్కడ చర్చ పెట్టి మనం చేసిన పనులు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఏ రంగంలో చూసినా 9 ఏండ్ల కిందటికి, నేటికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నదని పేర్కొన్నారు.
బీజేపీ ఒక్క మంచి పథకమైనా తెచ్చిందా?
బీజేపీ తొమ్మిదేండ్ల పాలనలో ఒక్క మంచి పథకమైనా తెచ్చిందా? కంపెనీలు అమ్ముడు, అదానీకి దోచిపెట్టుడు, ధరలు పెంచుడు, ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టుడు తప్ప ఒక్క మంచి పని చేసిందా? అని హరీశ్రావు ధ్వజమెత్తారు. భూతద్దం పెట్టి వెతికినా బీజేపీ వాళ్ల ఒక్క మంచి పని కనబడదని, కేసీఆర్ ఏం చేశారో పల్లెల్లో ఏ అవ్వను అడిగినా.. ఏ చెల్లిని అడిగి నా.. ఏ రైతును అడిగినా చెప్తారని పేర్కొన్నా రు. బీజేపీవి పడగొట్టే పనులైతే, బీఆర్ఎస్వి నిలబెట్టే పనులని చెప్పారు. బీజేపీ 8 రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టిందని గుర్తుచేశారు. ఎమ్మెల్యేలను కొనుడు, ఈడీ దాడులు చేసి కేసులు పెట్టుడు తప్ప, బీజేపీ సాధించింది ఏమిలేదని ధ్వజమెత్తారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా అని ప్రశ్నించారు. వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి, డీజిల్ రేట్లు పెంచి వ్యవసాయ పెట్టుబడిని రెట్టింపు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీది పథకాల్లో కోత, చార్జీల మోత అని దుయ్యబట్టారు. ఉపాధి పథకంలో కోతలు పెట్టి కూలీలకు పని ఎగ్గొట్టిందని విమర్శించారు. బీజేపీ వాళ్లకు బూతుల మీద ప్రేమ తప్ప.. రైతుల మీద లేదని బండి సంజయ్ను ఉద్దేశించి ఎద్దేవాచేశారు.