Minister Harish Rao | మెదక్, జూలై 8 (నమస్తే తెలంగాణ): బీజేపీ సర్కారు ఢిల్లీలో అవార్డులు ఇచ్చి.. గల్లీలో తిడుతున్నదని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. తెలంగాణలో అభివృద్ధి జరుగకపోతే వివిధ శాఖలకు ఎందుకు అవార్డులు ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ర్టానికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎవరు వచ్చినా సీఎం కేసీఆర్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన మెదక్ జిల్లా నర్సాపూర్లో జిల్లాకు చెందిన 610 మంది గిరిజన రైతులకు 520 ఎకరాలకు సంబంధించిన పోడు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషితోనే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయని, అది తెలంగాణ ప్రజల గొప్పదనమని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులను రద్దు చేస్తున్నది కేంద్రంలోని బీజేపీ సర్కార్ కాదా? అని ప్రశ్నించారు.
చెప్పిందొకటి.. ఇచ్చిందొకటి!
‘తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని పార్లమెంట్లో చెప్పి ఈ రోజు వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చి మోదీ మోసం చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వస్తే రూ.20 వేల కోట్లు వచ్చేవి.. కానీ, రూ.500 కోట్ల వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చారు. లడ్డూ గుజరాత్కు తీసుకుపోయిండ్రు… పిప్పర్మెంట్ తెలంగాణకు ఇచ్చిండ్రు’.. అని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. తెలంగాణకు హక్కుగా వచ్చే నిధులను ఆపింది మోదీ కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన రూ. లక్ష కోట్లను కేంద్రం ఆపిందని, నీతి ఆయోగ్ కింద సిఫారసు చేసిన రూ.24 వేల కోట్లు, ఫైనాన్స్ కమిషన్ కింద రూ.5,374 కోట్లు, బోరు బావుల వద్ద మీటర్లు పెడుతున్నారని రూ.21వేల కోట్లు ఆపారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంపై ప్రేమ ఉంటే విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోదీ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే గిరిజనవర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కారును బద్నామ్ చేసే కుట్ర చేస్తున్నారని, బీజేపీని ప్రజలు ఇక నమ్మబోరని చెప్పారు. బీజేపీ సర్కారుకు ఈడీ, సీబీఐ అండగా ఉంటే.. తమకు తెలంగాణ ప్రజలు అండగా ఉన్నారని చెప్పారు.
హక్కుదార్లు మీరే… ఓనర్లు మీరే
‘ఇక భూమికి హక్కుదార్లు మీరే.. ఓనర్లు మీరే’ అని పోడు పట్టాలు అందుకున్న రైతులనుద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణలో 4 లక్షల ఎకరాలకు పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దేశంలోనే పోడు పట్టాల పంపిణీలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల అటవీ ప్రాంతం ఉన్నదని, 7.40 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చామని తెలిపారు. 10.71 శాతం పోడు పట్టాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్లో 3.7 శాతం పోడు పట్టాలు ఇస్తే.. ఛత్తీస్గఢ్లో 6 శాతం ఇచ్చారని గుర్తు చేశారు.