హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బూస్టర్ డోసు పంపిణీని వేగవంతం చేసేందుకు సరిపడా టీకాలు సరఫరా చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్రావు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొవాగ్జిన్ డోసులు 8 లక్షలు ఉండగా, కొవిషీల్డ్ 80 వేలు మాత్రమే ఉన్నాయని, కోర్బివాక్స్ డోసు ఒక్కటి కూడా లేదని చెప్పారు. కరోనా పరిస్థితులు, రాష్ర్టాల సన్నద్ధతపై కేంద్ర వైద్యరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం వెబ్కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇందులో వైద్యశాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. బూస్టర్ డోసు పంపిణీ విషయంలో జాతీయ సగటు 23 శాతం ఉండగా.. తెలంగాణ దాదాపు రెట్టింపు స్థాయిలో 48 శాతం నమోదు చేసిందన్నారు. సీఎం కేసీఆర్ నిత్య పర్యవేక్షణ, అప్రమత్తం చేయడం, ప్రజల్లో అవగాహన పెంచడం వల్ల ఇది సాధ్యమైందని చెప్పారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతామహంతి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్రెడ్డి, డీఎంఈ రమేశ్రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్, సీఎం ఓఎస్డీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
కొవిడ్ నియంత్రణకు సంబంధించి హరీశ్రావు కేంద్రం దృష్టికి తెచ్చిన అంశాలు
బూస్టర్ డోస్ పంపిణీని మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన వ్యాక్సిన్లను రాష్ట్రానికి సరఫరా చేయాలి.
ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్-7 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ లక్షణాలు, వ్యాప్తి తీరు, ప్రభావం, చికిత్స వంటి అంశాల గురించి రాష్ర్టాలకు తెలియజేయాలి. ఈ అవగాహనతో మరింత అప్రమత్తంగా ఉండడం సాధ్యమవుతుంది.
గత అనుభవాల దృష్ట్యా ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఇందులో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్లను సమీప దవాఖానలతో అనుసంధానం చేసేలా మ్యాపింగ్ విధానాన్ని
తీసుకురావాలి.
వార్షిక మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చిన వెంటిలేటర్లు, పీఎస్ఏ ప్లాంట్లకు మరమ్మతులు జరగటం లేదు. వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా చర్యలు
తీసుకోవాలి.
ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ర్టాల్లో అవసరమైన వైద్య సదుపాయాలు మెరుగుపరిచేందుకు ఈసీఆర్పీ-3 (ఎమర్జెన్సీ కొవిడ్ రెస్పాన్స్ ప్యాకేజ్ -3) రూపొందించే విషయమై కేంద్రం ఆలోచించాలి.